70 ఏండ్ల జల స్వప్నం సాకారమైంది. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలానికి సాగునీరు చేరింది. అసాధ్యం అనుకున్న పథకాన్ని తక్కువ ఖర్చుతో సాధ్యం చేసి చూపించారు. సీఎం కేసీఆర్ను ఒప్పించి ఎంజీకేఎల్ఐ డిశ్చార్జీని 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు పెంచి బ్రాంచ్ కాల్వ మీదుగా అద్భుతాన్ని సృష్టించారు. నియోజకవర్గానికి కృష్ణా జలాలను తీసుకురావడంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్రెడ్డి సఫలీకృతుడయ్యాడు. ఎంజీకేఎల్ఐ ప్రధాన కాల్వ నుంచి ఖిల్లా మండలం మానాజిపేట వద్ద లింక్ కాల్వ సాయంతో బ్రాంచ్ కెనాల్ మీదుగా నీలవేణిని మళ్లించారు. షాపూర్ వద్ద ఇంజినీరింగ్ మెదడుకు పదునుపెట్టి నిర్మించిన వయాడెక్ట్ మీదుగా సాగునీరు పరుగులు పెడుతున్నది. నీటి రాకతో అడ్డాకుల పెద్ద చెరువు మెరిసిపోగా.. చూసిన రైతన్న మురిసిపోతున్నాడు.
– మహబూబ్నగర్, ఫిబ్రవరి, 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ముసాపేట
మహబూబ్నగర్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ముసాపేట : తెలంగాణ స్వాప్నికుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా వనపర్తి జిల్లాలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఎన్నో ఏండ్లుగా దేవరకద్ర నియోజకవర్గం ఎదురుచూస్తున్న కల బుధవారంతో సాకారమైంది. ఎంజీకేఎల్ఐ ప్రధాన కాలువ వద్ద లింక్ కెనాల్ ద్వారా బ్రాంచ్ కెనాల్కు కృష్ణా జలాలు మళ్లించారు. అక్కడి నుంచి వయాడెక్ట్ ద్వారా కాలువల్లో కృష్ణమ్మ గలగల పారుతూ.. ఆరు రోజుల తర్వాత అడ్డాకుల చెరువును ముంచెత్తింది. ఎండాకాలం సమీపిస్తున్న తరుణంలో నీళ్లు రావడంతో రైతులు మురిసిపోతున్నారు.
ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కాల్వలో పారుతున్న జలాలకు పూజలు చేశారు. ఒకటి, రెండు రోజుల్లో అడ్డాకుల చెరువు నిండి కాల్వల ద్వారా చిన్న మునుగల్చేడ్, పెద్ద మునుగల్చేడ్ గ్రామాల చెరువులను నింపనున్నారు. ఆ తరువాత వాగులో నుంచి సరళాసాగర్ ప్రాజెక్టులోకి కృష్ణా జలాలు చేరనున్నాయి. భవిష్యత్లో సరళాసాగర్ ప్రాజెక్టును నిండుకుండలా మార్చి రెండు పంటలకు సాగునీరివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ బృహత్ కార్యానికి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇంజినీర్లను సూచనలిచ్చి అంకురార్పణ చేశారు. అసాధ్యమనుకున్న కార్యాన్ని తక్కువ ఖర్చుతో సాధ్యం చేసి చూపించారు. సీఎం కేసీఆర్ను ఒప్పించి ఎంజీకేఎల్ఐ డిశ్చార్జీని 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు పెంచి బ్రాంచ్ కెనాల్ ద్వారా అద్భుతాన్ని సృష్టించారు. తన నియోజకవర్గానికి కూడా కృష్ణాజలాలను రప్పించడంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సఫలీకృతమయ్యారు.
వయాడెక్ట్.. ఇంజినీరింగ్ అద్భుతం
నీళ్లు, నిధులకుగానూ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం కొనసాగించామో దానిని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి చేసి చూపించారు. గుట్టలు, మిట్టలు ఉన్న ప్రాంతంలోకి నీళ్లు ఎలా వస్తాయి..? అని ప్రశ్నించిన వాళ్లకు ఇంజినీరింగ్ అధికారులతో సలహాలు తీసుకొని వారి సహకారంతో అద్భుతాన్ని సృష్టించారు. అందరూ ఆశ్చర్యపోయేలా 1.4 కిలోమీటర్ల వయాడెక్ట్ నిర్మించి కృష్ణా జలాలను పారించారు. శ్రీశైలం వద్ద ఉన్న కృష్ణమ్మ.. తమ చెంతకు వచ్చి కాల్వల్లో పరుగులు పెడుతుంటే ఇక్కడి రైతులు మురిసిపోతున్నారు. ఇందుకుగానూ ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం రూ.110 కోట్లు మాత్రమే. వనపర్తి, దేవరకద్ర నియోజకవర్గాల్లోని 25 వేల ఎకరాలకు తక్కువ ఖర్చుతో సాగునీరు అందేలా చేశారు. పరోక్షంగా అనేక తండాల్లోని చెరువులు, వాగులకు నీళ్లు మళ్లించి అదనంగా మరో 10 వేల ఎకరాలు సాగయ్యేలా చేస్తున్నారు. వయాడెక్ట్.. ఇంజినీరింగ్ అద్భుతమని రైతులు కొనియాడుతున్నారు.
బ్రాంచ్ కెనాల్ ద్వారా నీటి మళ్లింపు..
వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలం షా పూర్ వద్ద ఉన్న బ్రాంచ్ కెనాల్ 14 కిలోమీటర్ వద్ద నిర్మించిన వయాడెక్ట్ ద్వారా కాల్వల్లోకి నీ ళ్లు మళ్లించారు. ఎంజీకేఎల్ఐ ప్రధాన కాల్వకు అనుసంధానిస్తూ ఏర్పాటు చేసిన బ్రాంచ్ కెనాల్ ట్రయల్న్ విజయవంతం కావడంతో.. రైతుల ఆనందానికి అవధుల్లేవు. వయాడెక్ట్ ద్వా రా షాపూర్, మానాజిపేట, ఉప్పర్పల్లి, అడ్డాకుల పెద్ద చెరువుకు సాగునీరు చేరింది. ఈనెల 17న వయాడెక్ట్ వద్ద ట్రయల్న్ చేసి నీళ్లు వదిలారు. ఆరు రోజుల తరువాత బుధవారం నీళ్లు అడ్డాకుల చెరువుకు చేరాయి. దీంతో సాగునీటికి ఢోకా లేదని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
భూగర్భజలాలు కూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు. అయితే, అడ్డాకుల పెద్ద చెరువు సహజసిద్ధంగా రెండు గుట్టల మధ్య ఉంటుంది. ముందు భాగం ఉన్న కట్ట ఎత్తు పెంచితే అర టీఎంసీ వరకు నీళ్లు నిల్వ చేసే అవకాశం ఉన్నది. ఈ చెరువు కట్టకు మిషన్ కాకతీయ కింద మరమ్మతులు చేశారు. కృష్ణాజలాలు వస్తున్న నేపథ్యంలో చెరువు కట్ట పెంచితే మరింత ఆయకట్టుకు సాగునీరివ్వొచ్చని అన్నదాతలు అభిప్రాయపడుతున్నారు. వానకాలంలో ఎక్కువ మొత్తంలో నీళ్లు వస్తాయని.., సరళాసాగర్ వరకు సాగునీటికి ఢోకా ఉండదని అంటున్నారు.