వడ్డేపల్లి, ఏప్రిల్ 1: బడికి దూరమైన చిన్నారులకు చదువుపై ఆసక్తి కలిగించేందుకు ఎంవీ ఫౌండేషన్ నిరంతరం కృషి చేస్తున్నది. ఈక్రమంలో ఫౌండేషన్ నేషనల్ కన్వీనర్ ఆర్.వెంకటరెడ్డి, స్టేట్ చీఫ్ విప్ వై.రాజేంద్రప్రసాద్ సూచనల మేరకు వడ్డేపల్లి, రాజోళి మండలాల్లో అనిమిరెడ్డి, నాగపుల్లయ్య, సాయికుమార్ చర్యలు చేపట్టారు.
హక్కుల పరిరక్షణే ధ్యేయంగా..
అక్షరాస్యత అవసరమనే నినాదంతో ఫౌండేషన్ ముందడుగు వేస్తున్నది. గత నాలుగేండ్లుగా అన్ని గ్రామాల్లో వలంటీర్ల సహాయంతో కమిటీలు, యువజన సంఘాలు ఏర్పాటు చేసుకొని బాలలహక్కుల పరిరక్షణ, మూఢనమ్మకాలను పారదోలడం, బాల్యవివాహాల నిర్మూలన, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు అనే నినాదాలతో వాల్పోస్టర్లను విడుదల చేస్తున్నది. కలెక్టర్ మొదలుకొని ప్రజలను భాగస్వాములు చేస్తూ వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు ఫౌండేషన్ కృషి చేస్తున్నది. ఫౌండేషన్ తరఫున గతంలో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు బూట్లు, ఆటవస్తువులను ఉచితంగా పంపిణీ చేశారు. చిన్నారులు ప్రైవేటుకు దీటుగా ఆటపాటలతో శారీరక ధృడత్వాన్ని, మానసికోల్లాసాన్ని పెంపొందించడమే లక్ష్యంగా వారికి క్యారంబోర్డు, చెస్, ఫజిల్ పుస్తకాలు, క్రికెట్ కిట్, ఫుడ్బాల్ వంటి సామగ్రిని ఉచితంగా పంపిణీ చేశారు. బాలలహక్కుల పరిరక్షణ వేదిక కమిటీలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలను ఏర్పాటు చేసి ప్రజాప్రతినిధులు, పోలీసులు, అధికారుల సహకారంతో 14 గ్రామాల్లోని బడిబయట పిల్లలను సర్కార్ బళ్లల్లో చేర్పించి వారు బడికి వచ్చేలా చూస్తున్నారు.
తొమ్మిది గ్రామాలు ఎంపిక
మండలంలోని కొంకల, జూలేకల్, జక్కిరెడ్డిపల్లె, తిమ్మాజిపల్లె, రామాపురం, జిల్లెడుదిన్నె, పైపాడు, వెంకట్రామనగర్, బుడమొర్సు గ్రామాలను ఫౌండేషన్ ఎంపిక చేసుకున్నది. ఆ గ్రామాల్లోని ప్రభుత్వబడుల్లో చదువులో వెనుకబడిన విద్యార్థులను టీంలుగా విభజించి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం, వారికి వర్క్ పుస్తకాలు, పుస్తకాలు, చార్టులు, పెన్సిళ్లు, బలపాలను ఫౌండేషన్ అందజేసింది. తెలుగు, గణితం, ఇంగ్లిష్పై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులను మెరుగ్గా తయారుచేస్తున్నారు. పదిరోజులకోసారి పరీక్షలు నిర్వహించి వారి నైపుణ్యాన్ని పరిశీలిస్తున్నారు.
గ్రామానికో గ్రంథాలయం
బడికి దూరమైన వారికి చదువుపై ఆసక్తి కలిగించాలనే ఉద్దేశంతో సంస్థ ఎంపిక చేసిన తొమ్మిది గ్రామాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేశారు. ఎంవీఎఫ్, స్వచ్ఛందసంస్థల కార్యకర్తలు చిన్నారులకు పుస్తకాలు, కలర్ పెన్సిళ్లు, స్కెచ్ పెన్నులు అందించి ఆడుతూపాడుతూ చదువుకునేటట్లు తయారుచేస్తున్నారు. ఎంవీ ఫౌండేషన్ మండల కోఆర్టినేటర్ అనిమిరెడ్డి రాజోళి, వడ్డేపల్లి మండలాల్లో 1,900 పుస్తకాలను, కలర్ స్కెచ్లను పంపిణీ చేశారు. చిన్నారుల నుంచి స్పందన వస్తుండంతో గ్రామంలోని నిరుద్యోగ యువత నిర్వహణ బాధ్యతలు చేపట్టినట్లు ఎంవీ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు.
నేటి బాలలే రేపటి పౌరులు
బాలలహక్కులను కాపాడుతూ వారికి ఎంవీ ఫౌండేషన్స్ ఆధ్వర్యంలో పుస్తకాలు, ఆటవస్తువులు, బూట్లు, దుస్తులు ఉచితంగా పంపిణీ చేస్త్తున్నం. ప్రతిఒక్కరూ బడికి వచ్చేలా చూస్తున్నాం. బాలల భవిష్యత్తు బాగుండాలని, ప్రతిఒక్కరూ చదువుకోవానే ఉద్దేశంతో ఐదు రాష్ర్టాల్లో చిన్నారులను ప్రోత్సాహిస్తున్నాం.
– ఎంవీ ఫౌండేషన్ స్టేట్ చీఫ్ విప్ రాజేంద్రప్రసాద్
ఉత్సాహంగా చదువుతున్నారు
పిల్లలకు చదువుపై ఆసక్తి కలిగేందుకు ఎంవీ ఫౌండేషన్ కృషిచేస్తున్నది. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు అందరి సహకారంతో ముందుకు సాగుతున్నారు. పిల్లలు ఆడుతూపాడుతూ ఉత్సాహంగా చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవాలని, ప్రతిఒక్కరూ బడికి పోవాలని ఫౌండేషన్ సభ్యులు ప్రచారం చేయడం సంతోషాన్నిస్తున్నది. ఫౌండేషన్ సేవలు ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
– నాగేశ్, పైపాడు, సామాజిక కార్యకర్త