పాలమూరు, ఫిబ్రవరి 18 : మహా శివుడి కరుణాకటాక్షాలతో అందరూ సుఖశాంతులతో ఉండాలని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ కోరారు. శనివారం మహాశివరాత్రి సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని వీరన్నపేట పెద్ద శివాలయం, న్యూగంజ్లోని నీలకంఠ మల్లికార్జున స్వామి, షిర్డీసాయి, మాతా రాజేశ్వరి ఆలయాల్లో మంత్రి పూజలు, అభిషేకాలు చేశారు. బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో శివజయంతి మహోత్సవంలో మంత్రి జెండాను ఆవిష్కరించి ప్రత్యేక పూజలు చేశారు. ద్వాదశ జ్యోతిర్లింగాల రథాన్ని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పాలమూరు నుంచి శ్రీశైలం దారి పొడవునా ఎటుచూసినా శివనామ స్మరణ మార్మోగుతుందన్నారు. ఆధ్యాత్మిక వెల్లివిరిసేలా సీఎం కేసీఆర్ ఆలయాలను తీర్చిదిద్దారని తెలిపారు. ధూప దీప నైవేద్యాలతో పూజారులు, బాహ్మణులు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో అజ్ఞానులను విజ్ఞానులుగా మార్చడంలో బ్రహ్మకుమారీస్ సంస్థ ఓ టార్చ్ లైట్లా పనిచేస్తున్నదన్నారు.
విశ్వశాంతి కోసం భగవంతుడు సృష్టించిన అద్భుతమైన శక్తి బ్రహ్మకుమారీలు అన్నారు. కుల, మత, జాతి వివక్ష లేకుండా వీరు నిస్వార్థంగా సేవ చేస్తారని పేర్కొన్నారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేశ్, కౌన్సిలర్ నీరజ విఠల్రెడ్డి, బ్రహ్మకుమారీల ఉమ్మడి జిల్లా ఇన్చార్జి బీకే మహాదేవి, బీకే మంజు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.