మహబూబ్నగర్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరు జిల్లాలో ఇకపై వైద్యం అందక మరణించే ఘటనలు పునరావృతం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో డాక్టర్లతో వైద్య సేవలు అందిస్తామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బు ధవారం హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో డాక్టర్ శ్రీనిగంగాపాని ఆధ్వర్యంలో వరల్డ్ డాక్టర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన జూమ్ మీటింగ్లో విదేశాల్లో స్థిరపడిన ఉమ్మడి జిల్లాకు చెందిన వైద్యులతో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న జిల్లాకు మీ విలువైన సేవలు అందించాలని సూచించారు.
సీఎం కేసీఆర్ సహకారంతో మెడికల్ టూరిజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో స్థిరపడిన డాక్టర్లు ముందుకు రావడంతో మంత్రి అభినందించారు. వైద్య సేవలు అందక మృతి చెందే ఘటనలు చోటుచేసుకోకుండా మీలాంటి వైద్యులు సహకారం అందించాలని కోరారు. మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో విదేశాల్లో స్థిరపడిన డాక్టర్లు, ఇక్కడి వైద్యులతో కలిసి కన్సల్టింగ్ సేవలు అందించేందుకు వీలుగా ఈ-సేవ క్లినిక్స్ను జనవరి నుంచి ప్రారంభిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో మెడికల్ టూరిజం వైపు పాలమూరు వేగంగా అడుగులు పడేలా చూస్తామన్నారు. ఈ విషమంలో మంత్రులు కేటీఆర్, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావుతో కలిసి చర్చించనున్నట్లు చెప్పారు. సమావేశంలో ఐఎంఈ ప్రెసిడెంట్ డాక్టర్ రామ్మోహన్, డాక్టర్లు శ్యామూల్, మధుసూదన్రెడ్డి, శరత్చంద్ర, వంశీకృష్ణ, విజయ్కాంత్, పాలమూరు ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ జీవన్, మహేశ్బాబు, నర్సింహులు, సాఫ్ట్పత్ సిస్టమ్స్ సీఈవో రవిచందర్ పాల్గొన్నారు.