మూడు గంటల కరెంట్ కావాల్నా.. 24 గంటలు కరెంట్ కావాల్నా? అని సభికులను మంత్రి హరీశ్రావు చేతులెత్తమన్నారు. దీంతో 24 గంటల కరెంట్కు సభికులు పెద్ద ఎత్తున చేతులెత్తగా.., మూడు గంటల కరెంట్కు ఒక్కరు కూడా చేతి ఎత్తలేదు.. ఇగో గీడ్నే తేలిపాయే.. రాబోయే ఎలక్షన్లో గులాబీ పార్టీకి హ్యాట్రిక్ ఖాయమన్నారు.
‘పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సాగునీటితో పూర్తి స్థాయిలో సస్యశ్యామలం చేస్తాం.. కృష్ణా జలాలను ప్రతి గుంటకు పారించి రైతుల పాదాలు కడిగి వారి రుణం తీర్చుకుంటాం.. కేసీఆర్ సీఎం అయ్యాకే ఉమ్మడి జిల్లా ప్రజల జీవితాల్లో వెలుగులు సంతరించుకున్నాయి.. వలసలు దూరమై.. ఉద్యోగ, ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగింది.. సిరుల పంటలు పండి రైతులు ఆర్థికంగా ఎదిగారు’.. అని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా కోస్గి, మక్తల్, వనపర్తి జిల్లా కొత్తకోటలో మంత్రి పర్యటించారు. మదనాపురంలో 136 డబుల్బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు. అలాగే మూడు ప్రాంతాల్లో బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. వచ్చే ఐదేండ్లలో రాష్ట్రంలో ఏం చేయాలో ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నామన్నారు. త్వరలో ప్రకటించే బీఆర్ఎస్ మ్యానిఫెస్టో చూస్తే ప్రతిపక్షాల మైండ్ బ్లాంక్ కావడం ఖాయమన్నారు. సీఎం కేసీఆర్ అంటే నమ్మకం.. అదే కాంగ్రెస్ది నాటకమని విమర్శించారు. 24 గంటల కరెంట్ కావాలా..? 3 గంటల కరెంట్ కావాలా..? అని ప్రశ్నించారు. కాంగ్రెసోళ్లకు లీడర్ లేడు.. బీజేపోళ్లకు క్యాడర్ లేదని ఎద్దేవా చేశారు.
– మహబూబ్నగర్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మహబూబ్నగర్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరు ఎత్తిపోతల పథకం నీళ్లు తెచ్చి పాలమూరు ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఇటీవలే సీఎం కేసీఆర్ ప్రారంభించారని, పంపింగ్ అవుతున్నదని, టన్నెళ్లు ఐపోయినయ్.. రిజర్వాయర్లు ఐపోయినయ్.. కాల్వలు తవ్వుకునుడు.. నీళ్లు తెచ్చుడే మిగిలిందన్నారు. ఏడాదిలోగా పాలమూరు నీళ్లను తెచ్చి రైతుల పాదాలు కడుగుతామని స్పష్టం చేశారు. బుధవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మెహన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డిలతో కలిసి రూ.వందల కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నారాయణపేట జిల్లా కోస్గి, మక్తల్, వనపర్తి జిల్లా కొత్తకోటలో నిర్వహించిన బహిరంగ సభల్లో మంత్రి మాట్లాడారు. ఇయ్యాల నల్లా తిప్పితే నీళ్లు ఎట్లాగైతే వస్తున్నయో మీ పొలంలోని ప్రతిగుంటకు కృష్ణాజలాలు పారించి మీ అందరి రుణం తీర్చుకుంటామన్నారు.
సీఎం కేసీఆర్ అంటే ఒక నమ్మకంమని.. మన కోసం మంచి పనులు చేయాలని నిరంతరం ఆలోచించి అందుకు కృషి చేస్తున్నారన్నారు. కర్ణాటకలో 24గంటలు కరెంట్, రెండువేల పింఛన్, కల్యాలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు. అక్కడ కరెంట్ ఇవ్వలేక చెతులెత్తేసిండ్రని, బస్సులు బం ద్ అయినయినవని.. అలాంటోళ్లు ఇక్కడొచ్చి ఏదో చేస్తామని చెబితే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. 2009లో కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో తండాలను పంచాయతీలను చేస్తామని, ఆరుకిలోల బియ్యం ఇస్తామని, 9గంటల కరెంట్ ఇస్తామని ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేని చేతగాని పార్టీ కాంగ్రెస్ అన్నారు. త్వరలో ప్రతిపక్షాల దిమ్మతిరిగే మ్యానిఫెస్టో బీఆర్ఎస్ నుంచి రాబోతున్నదని, వాళ్ల మైండ్ బ్లాక్ అయిపోతదన్నారు. ఇప్పటికే బీజేపోళ్లు జాకీ వేసి లేపినా లేసేటట్లు లేరని.. కాంగ్రెసోళ్లు గెలిచేటట్లు లేరన్నారు. ఎవరెన్ని అబద్ధాలు చెప్పినా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెసోళ్లకు లీడర్లేడని.. బీజేపోళ్లకు క్యాడర్ లేదని ఎద్దేవా చేశారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు అంటే.. ఇవాళ పోదాంపదా బిడ్డా సర్కారు దవాఖానకు అని పాటలు పాడే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రతి నియోజకవర్గంలో వంద పడకల దవాకణను నిర్మించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారన్నారు. భవిష్యత్లో ఐసీయూను ఏర్పాటు చేస్తామని, డయాలసిస్ సెంటర్ను కూడా ఇస్తామన్నారు. బస్తీ దవాఖానలు, ప్రతి నియోజకవర్గానికి దవాఖాన, ప్రతి జిల్లాకు ఓ మెడికల్ కాలేజీ, హైదరాబాద్లో సూపర్స్పెషాలిటీ దవాఖాన నిర్మించామన్నారు. దేవరకద్ర నియెజకవర్గానికి ఎమ్మెల్యే అడిగినందుకు ఓ డయాలసిస్ సెంటర్ను మంత్రి హరీశ్రావు మంజూరు చేశారు.
ఇక్కడే ఎన్నికల రిజల్ట్ తేలిపోయింది..
టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అమెరికాలో రైతులకు మూడు గంటలు కరెంట్ ఇస్తే సాలన్నడు.. మూడు గంటల కరెంట్ సరిపోతదా అని మంత్రి హరీశ్రావు ప్రజలను అడిగారు. మూడు గంటల కరెంట్తో మూడెకరాలు పార్తదా అన్నారు. 24గంటల కరెంట్ కావాలనుకున్నోళ్లు చేతులెత్తమని అనగానే..అందరూ చేతులెత్తారు.. మీడియా వాళ్లు జర ఈ దృశ్యం రేవంత్కు సూపియం డ్రి అంటూ మంత్రి చెప్పారు. ఇక రెవంత్ చెప్పినట్లు మూడు గంటలు కరెంట్ కావాలనుకున్నోళ్లు చేతులు ఎత్తండి అంటే ఒక్కరూ ఎత్తలేదు. ఇక్కడే ప్రజలు ఎన్నికల రిజల్ట్ తేల్చేశారని, కాంగ్రెస్ పనిఖతం..బీజేపీ జాకీలేపి ఎత్తినా రాదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రేవంత్ ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిస్తే.. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి తెలంగాణ వస్తే చీకటి అయితదన్నారు. తెలంగాణ వచ్చినంక ఆమాటలు అన్న కిరణ్కుమార్రెడ్డి బతుకే చీకటి అయిపోయిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి కపటం లేని మనిషని, గతంలో కంటే భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించాలని కోరారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డికి ఎవరైనా పోటీ ఉన్నారా.. పోటీచేసి గెలిచే దమ్ము కాంగ్రెసోళ్లకు ఉన్నదా అంటూ సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీతో గెలింపించాలని.. ఇక్కడ జులూస్ చూస్తుంటే ఎన్నికల్లో గెలిచిన సంబురం కనిపిస్తున్నదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మెహన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, రాజేందర్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, కార్పొరేషన్ చైర్పర్సన్ రజినీ సాయిచంద్, చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, జెడ్పీ చైర్పర్సన్లు స్వర్ణ సుధాకర్రెడ్డి, వనజమ్మ, డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, జిల్లా రైతు సమన్వయ సభ్యురాలు చిట్టెం సుచరిత, బీఆర్ఎస్ నాయకురాలు ఆల మంజుల, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సర్కారు సారె బతుకమ్మ చీర
కొత్తకోట, అక్టోబర్ 4 : మహిళలకు సర్కారు అందిస్తున్న సారె.. బతుకమ్మ చీర అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం కొత్తకోటలో దేవరకద్ర నియోజకవర్గానికి మంజూరైన రూ.35 కోట్లతో నిర్మించనున్న వంద పడకల దవాఖాన, కొత్తకోటలో రూ.5.75 కోట్లతో నిర్మిస్తున్న 30 పడకల దవాఖాన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే ఆలతో కలిసి మంత్రి భూమి పూజ చేశారు. అలాగే కోటీ 50 లక్షలతో బైపాస్ రోడ్డు, రూ.50 లక్షలతో కృష్ణుని ఆలయం వద్ద సీసీ రోడ్డు, శాలివాహన, మైనార్టీ కమ్యూనిటీ హాల్కు భూమి పూజ చేశారు. అనంతరం యువకులకు క్రికెట్ కిట్లను, మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.
సీఎం కేసీఆర్కు మద్దతుగా నిలవాలె
మదనాపురం, అక్టోబర్ 4 : రాష్ట్రంలో ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, లబ్ధిపొందిన ప్రతి కుటుంబం సీఎం కేసీఆర్ వెంట నడవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మదనాపురం మండల కేంద్రంలో నిర్మించిన 136 డబుల్ బెడ్రూం ఇండ్లను ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, ఆల మంజుల దంపతులు, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్తో కలిసి బుధవారం ప్రారంభించారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ పద్మావతి, జెడ్పీటీసీ కృష్ణయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రావణ్కుమార్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు రవీందర్రెడ్డి, మండల కోఆర్డినేటర్ హనుమాన్రావు, కురుమూర్తి స్వామి ఆలయ పాలక మండలి సభ్యుడు గోపిస్వామి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు యాదగిరి, యూత్ అధ్యక్షుడు రాజ్కుమార్ పాల్గొన్నారు.
సీఎం అండతో నిధుల వరద : ఎమ్మెల్యే ఆల
వనపర్తి, అక్టోబర్ 4 : నియోజకవర్గంలోని ప్రజల ఆరోగ్య పరిరక్షణకు దేవరకద్రకు 100 పడకల, కొత్తకోటకు 30 పడకల దవాఖానలను సీఎం కేసీఆర్ ఆశీస్సులు, మంత్రి హరీశ్రావు సహకారంతో ప్రారంభించినట్లు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. అలాగే దేవరకద్రకు డయాలసిస్ సెంటర్ మంజూరు కాగా మదనాపురంలో 136 డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి హరీశ్రావు ప్రారంభించడం సంతోషంగా ఉన్నదన్నారు. నియోజకవర్గ అభివృద్ధిని కోరినన్ని నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుండడంతో ఇంత అభివృద్ధి సాధ్యమైందన్నారు. ప్రతి గ్రామానికి బీటీ రోడ్లు, రెండు మున్సిపాలిటీల్లో ఒక్కోదానికి రూ.40 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసుకున్నట్లు తెలిపారు. రూ.250 కోట్ల వ్యయంతో రెండు వాగులపై చెక్ డ్యాంలు నిర్మించి 98 వేల ఎకరాలకు సాగునీరు వస్తుందన్నారు. ముఖ్యమంత్రికి, హరీశ్రావుకు నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తే మరింత ప్రగతి చేసి చూపుతానన్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ఉచిత హామీలపై జనాగ్రహం : ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి
కర్ణాటక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత హామీలపై అక్కడి ప్రజలు మూడు నెలలకే ప్రభుత్వంపై తిరగబడడం మొదలుపెట్టారని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అన్నారు. ఇటీవల జరిగిన కన్నడ అసెంబ్లీ ఎన్నికల్లో చేతగాని హామీలతో కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టించిందని విమర్శించారు. అక్కడ ఉచిత కరెంట్ లేదు.. పేదలకు రేషన్ బియ్యం ఇవ్వడం లేదు.. అక్కడికి వెళ్లి ప్రత్యక్షంగా చేశాను.. సామాన్యులు నిత్యం రోడ్లపైకి వచ్చి ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. చిట్టెం నీళ్ల రాముడిగా పేరు సంపాదించారన్నారు. నియోజకవర్గ ప్రజలతో కుటుంబ సభ్యుడిలా ఆయన ఉంటారన్నారు.
కార్యకర్తలకు అండగా ఉంటా : ఎమ్మెల్యే చిట్టెం
సీఎం కేసీఆర్ మార్గదర్శకంలో.. మంత్రి హరీశ్రావు సహకారంతో మక్తల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి తెలిపారు. మక్తల్ ప్రగతి సభలో ఆయన మాట్లాడుతూ 2018 ఎన్నికల ముందు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీశ్రావు ఈ ప్రాంత అభివృద్ధికి సహాయ, సహకారాలు అందించారన్నారు. నాడు భీమా ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి నియోజకవర్గంలో 2 లక్షల ఎకరాల బీడు భూములకు సాగునీరు అందించారన్నారు. మక్తల్కు రెండు వైపులా హైవే.. మరోవైపు రైల్వే లైన్ పూర్తి చేసి ఈప్రాంత అభివృద్ధికి ముందడుగు వేయించారన్నారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాని భరోసానిచ్చారు. మరోసారి బీఆర్ఎస్ను ఆదరించాలని కోరారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే త్వరలోనే ఊట్కూర్ పెద్ద చెరువుకు సాగుజలాలను తీసుకొస్తానన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం 150 పడకల దవాఖాన కావాలని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించి రూ.34 కోట్లను మంజూరు చేశారన్నారు. నేడు హరీశ్రావు చేతుల మీదుగా దవాఖానకు భూమి పూజ చేసుకోవడం సంతోషంగా ఉన్నదన్నారు.