నాగర్కర్నూల్, జూన్ 11 : ఓటరు జాబితా సవరణలు, కొత్త ఓటర్ల నమోదు, మార్పులు చేర్పులు, తొలగింపులు తదితర అంశాలపై చేపట్టిన ‘సర్’ కార్యక్రమంపై కార్యకర్తలు అవగాహన కలిగి ఉండాలని, ఇందుకోసం త్వరలోనే ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి కార్యకర్తలకు సూచించారు. గురువారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని మర్రి నివాసంలో ముఖ్యకార్యకర్తలకు ఏర్పాటు చేసిన సమావేశంలో సర్ కార్యక్రమంపై పలు సూచనలు చేశారు.
ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో బీఎల్ఏల బాధ్యతలు, విధులపై స్పష్టత తీసుకురావడం, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సంబంధించి నాగర్కర్నూల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అవగాహన కల్పించడం కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగానే గురువారం నాగర్కర్నూల్ నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలతో మర్రి జనార్దన్రెడ్డి చర్చించారు.
కార్యక్రమంలో అందరూ అవగాహన కలిగి ఉండాలని, ఇందుకోసం ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేసి కార్యకర్తలు అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. పార్టీ కార్యకర్తలు శిక్షణ కార్యక్రమానికి హాజరై సర్ ప్రక్రియపై పూర్తి అవగాహన పెంచుకోవాలని, సర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. త్వరలో డిజిటల్ పద్ధతిలో ప్రారంభం కానున్న బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై కూడా కార్యకర్తలకు దిశానిర్ధేశం చేయనున్నట్లు తెలిపారు.