మల్ధకల్: మల్ధకల్ వెంకటేశ్వరస్వామి(తిమ్మప్ప) మహిమాన్వితుడని మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం పూర్వ పీఠాధిపతి సువిద్యేంద్ర తీర్థ స్వాములు అన్నారు. స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం కళ్యాణ మండపంలోని శ్రీమూల రాములవారికి సంస్థాన పూజ, దశ విధ హారతులు నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ పీఠాధిపతి ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. దైవనామస్మరణతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవాటు చేసుకోవాలన్నారు.
పరోపకారం కంటే మించింది ఏదీ లేదని, నేను అనేది వీడి మనం అనేది మనస్సులో ఉంచుకోవాలని మంత్రాలయం సువిద్యేంద్ర తీర్థ స్వామి పేర్కొన్నారు. స్వామివారికి ఆలయ ఈవో సత్య చంద్రారెడ్డి, ప్రహ్లాదరావు ఘనస్వాగతం పలికారు. దేవాలయ అర్చకులు జోషి రమేశ్ చార్యులు, మధుసూధనాచారి, ధీరేంద్రదాస్, రవికుమార్ జోషి, వాల్మీకిల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఈఓ కేశవాచారి, చైర్మన్ గిరిరావు తదితరులు పాల్గొన్నారు.