మహబూబ్నగర్, మార్చి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా మహబూబ్నగర్ ఎంపీ స్థానానికి సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డిని ఎంపిక చేశారు. సిట్టింగ్ ఎంపీకే మరోసారి ఛాన్స్ ఇవ్వడంతో అధికార పార్టీని ఇరుకున పెట్టినట్లయ్యింది. మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంపీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించడంతో కాంగ్రెస్, బీజేపీలు గందరగోళంలో పడ్డాయి. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డిని ఎంపీగా బరిలో నిలుపుతున్నట్లు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించడం ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టించింది. మరోవైపు బీజేపీలో కూడా టికెట్ కోసం హోరాహోరీగా పోరు నడుస్తున్నది. మహబూబ్నగర్ స్థానానికి తొలి జాబితాలో చోటు దక్కకపోవడంతో ఆ పార్టీ నేతలు ఖంగుతున్నారు. ఇదిలా ఉండగా, మరో వారం పది రోజుల్లో దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ముందస్తుగా అభ్యర్థిని ప్రకటించడంతో కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపైంది. ఈసారి ఎలాగైనా ఎంపీ స్థానాన్ని దక్కించుకోవాలని పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. సిట్టింగ్ ఎంపీకి టికెట్ ఇవ్వడంతో పాలమూరు పార్లమెంట్ పరిధి పార్టీ నేతల్లో జోష్ పెరిగింది.
మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానం గులాబీ పార్టీకి కంచుకోటగా మారింది. 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో పార్టీ అధినేత కేసీఆర్ పాలమూరు ఎంపీగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉంటూనే 2014లో చిరకాల స్వప్నమైన తెలంగాణ స్వరాష్ర్టాన్ని సాధించి పాలమూరు ప్రస్థానం చరిత్రలో నిలిచిపోయేలా చేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో కూడా పార్టీ అభ్యర్థి జితేందర్రెడ్డి అఖండ విజయం సాధించారు. ఆ తర్వాత పార్లమెంట్లో బీఆర్ఎస్ తరఫున ఫ్లోర్ లీడర్గా పనిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు వెన్నుపోటు పొడవడంతో పార్టీ అధినేత కేసీఆర్ ఆయనకు టికెట్ నిరాకరించారు. దీంతో పారిశ్రామికవేత్త మన్నె సత్యనారాయణరెడ్డి సోదరుడు మన్నె శ్రీనివాస్రెడ్డికి టికెట్ కేటాయించడంతో గెలుపొందారు. ఐదేండ్లు పార్లమెంట్లో తనదైన శైలిలో సమస్యలపై గళమెత్తిన మన్నె శ్రీనివాస్రెడ్డికి మరోసారి టికెట్ కేటాయించి బరిలో నిలుపుతున్నారు. విజయం సాధించిన బీఆర్ఎస్ పార్టీ ఈ సారి కూడా హ్యాట్రిక్ సాధిస్తుందని పార్టీ క్యాడర్ ధీమా వ్యక్తం చేస్తున్నది.
మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానాన్ని సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డికి కేటాయించడం వెనుక గులాబీ బాస్ కేసీఆర్ పెద్ద వ్యూహమే రచించారు. సెట్టింగ్ ఎంపీగా ఉంటూ అందరినీ కలుపుకొని పోవడమే కాకుండా క్యాడర్కు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మంచి పేరు సంపాదించారు మన్నె శ్రీనివాస్రెడ్డి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మన్నె శ్రీనివాస్రెడ్డి కుటుంబంలో రాజకీయ చిచ్చుకు తెరలేపింది. ఆయన సోదరుడి కుమారుడు మన్నె జీవన్రెడ్డికి రాజకీయంగా పదవులు ఇస్తామని ఆశ చూపి పార్టీలో కలిశాక చివరకు మొండి చేయి చూపించారు. పార్లమెంట్ స్థానం ఇవ్వకుండా సీఎం రేవంత్రెడ్డి ఏకంగా తన సొంత నియోజకవర్గమైన కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యేకు టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించి జీవన్రెడ్డి ఆశలపై నీళ్లు చల్లారు. మరోవైపు మన్నె జీవన్రెడ్డి రాకను షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. దీంతో ఆయనకు ఎంపీ టికెట్ నిరాకరించారు. రాబోయే ఎమ్మెల్సీ టికెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన ఇవ్వకపోవడంతో జీవన్రెడ్డి నిరాశలో ఉన్నారు. దీంతో మరోసారి సిట్టింగ్ ఎంపీకి కేసీఆర్ టికెట్ కేటాయించడంతో సొంత బాబాయ్ కోసం జీవన్రెడ్డి మళ్లీ కారెక్కే అవకాశం కనిపిస్తున్నది. మన్నె అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇటు కాంగ్రెస్లో అభ్యర్థిత్వాని ఆశించి భంగపడ్డ నేతలు, బీజేపీలో టికెట్ ఆశించినా రాని పరిస్థితిలో ఉన్న డీకే అరుణ వర్గం వచ్చే ఎన్నికల్లో సైలెంట్గా ఉండే అవకాశం కనిపిస్తున్నది. ఇది బీఆర్ఎస్కు కలిసి వస్తుందని కేసీఆర్ వ్యూహాత్మకంగా సిట్టింగ్ ఎంపికే టికెట్ కేటాయించడం జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు.