నాగర్కర్నూల్, జూలై 31: కందనూలు యుగ పురుషుడు, అభినవ అంబేద్కర్ మాజీ మంత్రి పుట్టపాగ మహేంద్రనాథ్ అని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. నాగర్కర్నూల్ పట్టణంలోని బాబు జగ్జీవన్రామ్ భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి మహేంద్రనాథ్, బాబు జగ్జీవన్రామ్ విగ్రహాలను ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎంపీ రాములు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ విప్ మంద జగన్నాథం, జెడ్పీ చైర్పర్సన్ పద్మావతీబంగారయ్య ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మర్రి మాట్లాడుతూ నాగర్కర్నూల్ రాజకీయాల్లో మహేంద్రనాథ్ది ప్రత్యేక స్థానం అన్నారు. పేదల కోసం ప్రత్యేకంగా పాఠశాలను స్థాపించారన్నారు. ప్రజాప్రతినిధిగా రాజ్యాంగ ఫలాలను ప్రజలకు అందించడంలో ముందున్నారని గుర్తుచేశారు. అంబేద్కర్ లాగే మహేంద్రనాథ్నూ కాంగ్రెస్ ఓడించేందుకు కుట్ర పన్నిందన్నారు.
నాగర్కర్నూల్ ప్రాంతానికి ఆయన చేసిన సేవలు ఎల్లకాలం గుర్తుండిపోతాయన్నారు. ఈప్రాంత ప్రజలు ఆయన్ను గుర్తుంచుకునేందుకు కొల్లాపూర్ చౌరస్తాలో 21ఫీట్లతో మహేంద్రనాథ్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. రూ.5 లక్షలు ఎంజేఆర్ ట్రస్టు ద్వారా కమ్యూనిటీ హాల్ ఫర్నీచర్ కోసం అందజేస్తామన్నారు. స్థానికుడైన రిటైర్డ్ వార్డెన్ చెన్నయ్య ఈ విగ్రహాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి మాట్లాడుతూ నేటితరం రాజకీయ నాయకులకు మహేంద్రనాథ్ స్ఫూర్తిదాయకమన్నారు. ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు మాట్లాడుతూ తాను మహేంద్రనాథ్ పేరును తలవని రోజు ఉండదని గుర్తు చేసుకున్నారు.
అంబేద్కర్, జగ్జీవన్రామ్, మహేంద్రనాథ్ ఆశయాలను కొనసాగిస్తానన్నారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి మంద జగన్నాథం మాట్లాడుతూ అటవీ, ఫైనాన్స్ శాఖల మంత్రిగా ఎన్నో అభివృద్ధి పనులు చేసి పదవులకు వన్నెతెచ్చారన్నారు. ఈ ప్రాంత గాంధేయవాదిగా పేరుతెచ్చుకున్నారన్నారు. దళిత విద్యార్థులకు విదేశీ విద్యానిధి ద్వారా రూ.25లక్షల సాయం అందించేందుకు కృషి చేశారన్నారు. తాను ఎంపీ అయ్యానంటే అది మహేంద్రనాథ్ భిక్షే అని నాగర్కర్నూల్ ఎంపీ రాములు అన్నారు. విద్యాభివృద్ధిపై దృష్టి సారించేవారని, అప్పట్లోనే పాఠశాలను ఏర్పాటు చేసి ఇక్కడి ప్రజలను చైతన్యం చేశారన్నారు. నాగర్కర్నూల్ జిల్లాకు మహేంద్రనాథ్ పేరు పెట్టాలని సీఎంను కోరుతామన్నారు. హైదరాబాద్-శ్రీశైలం, భూత్పూర్-మన్ననూర్ నుంచి మాచర్లకు జాతీయ రహదారి వేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కల్పనాభాస్కర్గౌడ్, జెడ్పీటీసీలు చిక్కొండ శ్రీశైలం, పోతుగంటి భరత్ప్రసాద్, మార్కెట్కమిటీ చైర్మన్ కుర్మయ్య, దళిత సంఘాల నాయకులు జెట్టి, ధర్మరాజు, వార్డెన్ చెన్నయ్య, విజయ్, ప్రదీప్, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, దళితసంఘాల నాయకులు పాల్గొన్నారు.