శ్రీశైలం, ఫిబ్రవరి 12: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైలక్షేత్రంలో రెండోరోజు ఆదివారం భ్రమరాంబ, మల్లికార్జునస్వామికి చండీశ్వరపూజ, మండపారాధన కలశార్చన తదితర పూజలు జరిపించినట్లు ఈవో లవన్న తెలిపారు. అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామిఅమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి భృంగివాహనంపై వేంచేబుచేసి షోడశోపచార పూజలు నిర్వహించారు. మంగళవాయిద్యాలతో క్షేత్ర ప్రధాన వీధుల్లో ఊరేగించారు. చెంచు కళాకారుల జానపదాలు, కోలాటాలు, రాజభటుల వేషాలు, జాంజ్పథక్, గొరవనృత్యం, బుట్టబొమ్మలు, బీరప్పడోలు, నందికోలసేవ, ఢమరుకం, చిడతలు, శంఖం, చెక్కబొమ్మలు వివిధ రకాల విన్యాసాల సందడితో ఊరేగింపు కొనసాగింది.
ఉత్సవం అనంతరం కాళరాత్రిపూజ మంత్రపుష్పంతోపాటు స్వామిఅమ్మవార్లకు ఆస్థానసేవ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తుండటంతో క్షేత్రపరిధిలో సందడి నెలకొన్నది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తెలుగురాష్ర్టాల యాత్రికులతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరాది రాష్ర్టాల నుంచి వచ్చిన భక్తులతో శ్రీగిరి పురవీధులు కికిటలాడాయి. స్వామిఅమ్మవార్ల దర్శనాలకు బారులుదీరారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అర్జిత సేవ టికెట్లు రద్దు చేసి అందరికీ అలంకార దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం నాలుగు రకాలైన క్యూలైన్ల్లో ఉచిత, శ్రీఘ్ర(200), అతిశ్రీఘ్ర(500) దర్శనాలతోపాటు ఇరుముడితో వచ్చే శివస్వాములకు ప్రత్యేక క్యూలైన్లో స్వామివారి స్పర్శదర్శనం అందుబాటులో ఉందన్నారు.
అదేవిధంగా కంకణాలు ధరించి పాదయాత్రగా వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా దర్శనాలకు అనుమతించినట్లు ఈవో లవన్న తెలిపారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు మంచినీరు, వేడి పాలు, బిస్కెట్లు, మజ్జిగ అల్పాహారం అందిస్తూ ఉదయం 10గంటలనుంచి అన్నదాన మహాప్రసాదం అందుబాటులో ఉంచారు. కాలినడకన వచ్చే శివస్వాములకు మార్గమధ్యలో పలు స్వచ్ఛంద సంస్థలు అన్నదానం, మంచినీటి వసతి కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అటవీ ప్రాంతం నుంచి కాలినడకతో వచ్చేవారికి వైద్యసేవలు అందిస్తున్నారు. శివదీక్ష శిబిరాల్లో 23వ తేదీవరకు జోతిర్ముడి సమర్పణకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. స్వామి అమ్మవార్ల లడ్డూ ప్రసాదాలను 15కౌంటర్ల ద్వారా అందుబాటులో ఉంచారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగుల కోసం మూడు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సోమవారం హంసవాహనంపై శ్రీశైల ఆదిదంపతులు దర్శనమివ్వనున్నట్లు ఈవో తెలిపారు.
పట్టువస్ర్తాలు సమర్పణ
శ్రీశైల భ్రమరాంబమల్లికార్జునస్వామికి ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ దంపతులు పట్టుపస్ర్తాలు సమర్పించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ప్రధాన ద్వారం వద్ద స్వాగతం పలికి స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయించి పట్టువస్ర్తాలను సమర్పించారు. ఆయా కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ దంపతులు, ఈవో లవన్న దంపతులు, ప్రధాన అర్చకులు వీరయ్యస్వామి, మార్కండేయశర్మ, ధర్మకర్తల మండలి సభ్యులు, ఈఈ రామకృష్ణ, పౌరసంబంధాల అధికారి శ్రీనివాసరావు, ఏఈవోలు హరిదాస్, ఫణీంద్రప్రసాద్, శ్రీశైల ప్రభ సంపాదకులు అనిల్కుమార్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యన్న, సూపరింటెండెంట్ రవి, స్వాములు, వెంకటేశ్వరులు, మధుసూదనరెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.