మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూన్ 21 : జీతం ఇవ్వకపోయినా ఫర్వాలేదని సరిహద్దుల్లో సైనికుడిగా పనిచేసి ప్రాణాలు ఇచ్చేందుకు యువత సిద్ధంగా ఉన్నారని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. వారి దేశభక్తికి ఇది నిదర్శనమని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో అగ్నిపథ్కు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలో గాయపడిన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలకొండకు చెందిన తిరుపతయ్య, లక్ష్మమ్మ దంపతుల కుమారుడు శ్రీకాంత్యాదవ్ను మంత్రి మంగళవారం పరామర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీకాంత్ కాల్లోకి బుల్లెట్ దిగినా దేశానికి సేవ చేయాలనే ఆయన సంకల్పం మాత్రం సడలలేదన్నారు. దేశం కోసం ప్రాణాలు ఇచ్చేందుకు యువత సిద్ధపడితే కేంద్రం మాత్రం వారిపైనే బుల్లెట్లు గురిపెట్టడం అన్యాయమని అన్నారు. శ్రీకాంత్ వంటి అనేక మంది దేశ యువత భవిష్యత్తును కేంద్రం నాశనం చేస్తుందని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండించారు.
యువత భవిష్యత్తును అర్థం చేసుకుని కేంద్రం పాత పద్ధతిలోనే సైనిక నియామకాలు చేపట్టాలని, ఫిజికల్ టెస్ట్లో ఉత్తీర్ణులైన ఆర్మీ అభ్యర్థులందరికీ రాత పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే లాభాల్లో నడుస్తున్న కేంద్ర రంగ సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసి ప్రభుత్వ రంగ సంస్థల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్లు లేకుండా చేశారన్నారని ఆరోపించారు. దేశ భద్రత విషయంలో డిఫెన్స్ రంగంలో కాంట్రాక్టు పద్ధతి వల్ల ఎందరో యువత తీవ్రంగా నష్టపోవడంతో పాటు కీలకమైన రక్షణ రంగాన్ని ప్రైవేటు పరం కాబోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయాలి
కేంద్రం ప్రకటించిన రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయాలని, యువత మనోభావాలను కేంద్రం అర్థం చేసుకోవాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఆర్మీ అభ్యర్థులు ఎవరూ ఆందోళన చెందవద్దని ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. బుల్లెట్ గాయమైన శ్రీకాంత్ యాదవ్కు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. టీవోడీ విధానంలో సైనిక నియామకాలు జరగకుండా చూడాలని శ్రీకాంత్ యాదవ్ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
ఈ పద్ధతి అమలు చేస్తే వాచ్మెన్ కన్నా అన్యాయానికి గురవుతామని యువకుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కపైసా జీతం ఇవ్వకపోయినా దేశం కోసం సరిహద్దుల్లో ప్రాణాలు ఇచ్చేందుకు సిద్ధమని స్పష్టం చేశాడు. కేంద్రం సైనిక అభ్యర్థుల జీవితాలతో చెలగాటం ఆడవద్దని కోరాడు. దేశంపై, సరిహద్దుల్లో దేశ సేవ చేయాలనే శ్రీకాంత్ యాదవ్ అంకిత భావాన్ని చూసి మంత్రి చలించిపోయారు. శ్రీకాంత్కు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసానిచ్చారు.