మహబూబ్నగర్, మే 20 : దళితబంధు పథకంలో గ్రౌండింగ్ అయిన యూనిట్లను ప్రభుత్వ పథకాలను అనుసంధానం చేయాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నా రు. దళితబంధుపై శుక్రవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దళితబంధు పథకం కింద మొదటివిడుత ట్రాన్స్ఫోర్టు సర్వీసు, ఇండస్ట్రీ, డెయిరీ తదితర రంగాల్లో సుమారు 315 యూనిట్లను మంజూరు చేసినట్లు తెలిపారు. ఆయా రంగాల్లో గ్రౌండ్ అయిన యూనిట్లను ప్రభుత్వ పథకాలకు అనుసంధానం చేస్తే లబ్ధిదారులకు ఉపాధి కలుగుతుందన్నారు.
ప్రత్యేకించి సెంట్రింగ్ మెటీరియల్ను మనఊరు-మనబడి నిర్మాణాలకు, డిజిటల్ సర్వే యూనిట్ను ప్రభుత్వ సర్వే పనులకు అనుసంధానం చేయాలన్నారు. అలాగే డెయిరీ, ట్రాన్స్పోర్టు విభాగాల్లోని యూనిట్లను కూడా సాధ్యమైనంత వరకు ప్రభుత్వం చే పట్టే కార్యక్రమాలకు అనుసంధానం చేస్తే ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మిగిలిన యూనిట్లను కూడా త్వరగా గ్రౌండింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా వాటరింగ్డే సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో మొక్కలకు నీరు పోశారు. ప్రతిఒక్కరూ మొక్కలను సంరక్షించాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ యాదయ్య, పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి మధుసూదన్, డీఆర్డీవో యాదయ్య, డీఏవో వెంకటేశ్, ఆర్డీవో నరేశన్, ఉద్యానశాఖ డీడీ సాయిబాబా, పరిశ్రమల శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు.