మహబూబ్నగర్, మే 19: మహబూబ్నగర్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో మరింత వేగం పెంచాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. గురువారం హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు, అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. మహబూబ్నగర్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ట్యాంక్బండ్, ఐలాండ్ విద్యుత్ సరఫరాకు అవసరమయ్యే కేబుల్ లైన్లను, విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలన్నారు. సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణ పనులు, మినీ శిల్పారామానికి అవసరమైన ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్లను సిద్ధం చేయాలన్నారు.
హన్వాడ మండలానికి 13ట్రాన్స్ఫార్మర్లు, మహబూబ్నగర్ రూరల్ మండలానికి 19 ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసి మెరుగైన విద్యుత్ సరఫరా చేయాలన్నారు. ట్యాంక్బండ్ వద్ద 50కేవీ ట్రాన్స్ఫార్మర్లను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. మరిన్ని ట్రాన్స్ఫార్మర్లను మరో రెండు రోజుల్లో ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్ఈ మూర్తి, ఈఈ, డీఈఈలు, కౌన్సిలర్ నర్సింహులు, హన్వాడ నాయకులు కృష్ణయ్య, రమణారెడ్డి, చెన్నయ్య, హరిచందర్నాయక్, చుక్కయ్య, రాజు పాల్గొన్నారు.