లంపీ స్కిన్ వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ వ్యాపిస్తుండటంతో పశువులు అన్నింటికీగోట్ ఫాక్స్ వ్యాక్సిన్ వేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశంతో పశువైద్య శాఖ జిల్లా స్థాయి అధికారులు వ్యాక్సినేషన్ చేసేందుకు చర్యలు చేపట్టారు. పాడి రైతులు కూడా జాగ్రత్తలు పాటించాల్సిందిగా పశువైద్య శాఖ సూచిస్తున్నది. దీంతో ఉమ్మడి జిల్లాలో దాదాపు 6 లక్షల పశువులకు వ్యాక్సిన్ వేసేందుకు రంగం సిద్ధమైంది.
నాగర్కర్నూల్, అక్టోబర్ 23(నమస్తే తెలంగాణ): లంపీ స్కిన్ వైరస్ వేగంగా విస్తరిస్తున్నది. దీంతో పాడి రైతులతో పాటుగా ప్రజలందరిపైనా ప్రభావం చూపించే పరిస్థితులు ఉత్పన్నం కాబోతున్నాయి. దీంతో కేంద్రం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పశువులన్నింటికీ గోట్ ఫాక్స్ వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది. దీంతో జిల్లాల పశువైద్య శాఖల అధికారులు పశువులన్నింటికీ వ్యాక్సిన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు.
లంపీ వైరస్ అంటువ్యాధి. ఈ వైరస్ ఒక పశువు నుంచి మరో పశువుకు సోకుతుంది. లంపీ స్కిన్ వ్యాధి వచ్చిన పశువు తాగిన నీళ్లు, మేత ద్వారా ఇతర పశువులకు లంపీ వైరస్ విస్తరిస్తుంది. పశువులకు కీటకాల ద్వారా కానీ, స్రావాల ద్వారా కానీ వ్యాధి క్రిములతో కలుషితమైన గాలి ద్వారా, కీటకాలైన క్యూలెక్స్, ఎడిస్ దోమలు, స్టోమాక్సిక్ బయోమీయా ఈగలు, పిడుదుల ద్వారా, పాలుతాగే దూడలకు తల్లిపాల ద్వారా లేదా పొదుగుపై ఉన్న చర్మం పొక్కుల ద్వారా, కృత్రిమ గర్భధారణ వ్యాధి సంక్రమిస్తుంది.
వ్యాధి వచ్చిన పశువులకు ప్రస్తుతం పశువైద్య శాఖ ద్వారా గోట్ ఫాక్స్ వ్యాక్సిన్ వేస్తున్నారు. ఈ వైరస్ సోకిన ప్రాంతంలోని 5 కిలో మీటర్ల పరిధిలోని పశువులకు ప్రస్తుతం వ్యాక్సినేషన్ చేయడం చేస్తున్నారు. అయితే వ్యాధి తీవ్రత దృష్ట్యా ఇకపై ప్రతి పశువుకూ వ్యాక్సిన్ చేయన్నారు. అయితే వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ముందుగా అధికారులు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా త్వరలో ప్రతి పశువుకూ వ్యాక్సినేషన్ వేయనున్నారు. అయితే రైతులు ముందు జాగ్రత్తలు పాటిస్తే చాలా వరకు వైరస్ వ్యాప్తిని అరికట్టే అవకాశముంటుంది. రైతులు వైరస్ సోకిన పశువును గుర్తించిన వెంటనే దాన్ని వేరు చేయాలి. పశువైద్య శాఖకు సమాచారం అందించాలి. వ్యాక్సిన్ వేయించాలి. కాగా వ్యాధి సోకిన పశువుల నుంచి పాలు పిండరాదని పశువైద్య శాఖ అధికారులు తాజాగా సూచిస్తున్నారు. ఆ పశువుకు వైరస్ పూర్తిగా తగ్గే వరకు పాలను పితకడం ఆపేయాల్సి ఉంటుంది. ఇక పశువుల పాకను పరిశుభ్రంగా ఉంచేలా చూసుకోవాలి. నీరు, చెత్త, పశువుల పేడ లేకుండా పాకను శుభ్రం చేసుకోవాలి. మొత్తం మీద వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో పాడి రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అయిజ మండలం సంకాపురంలో దూడ, లింగాల మండలం అవుసలికుంట గ్రామంలో కోడేదూడ లంపీ వైరస్ సోకి ఆదివారం మృతిచెందాయి.
లంపీ స్కిన్ వ్యాధి వచ్చిన పశువుకు 104-105డిగ్రీల జ్వరం ఉంటుంది. కళ్ల నుంచి, ముక్కు నుంచి నీరు కారడం, నోటి నుంచి చొంగ కారటం ఈ వ్యాధి మొదటి లక్షణం. తర్వాత చర్మం కింద, నోటి చిగురు, ముట్టె మీద, ముక్కుమీద, కణితులు మెడ, తొడల వద్ద గ్రంథులు వాచి, పొదుగు, రొమ్ము భాగం, కాలి కీళ్లలో నీరు చేరుతున్నది. పశువు నీరసిస్తుంది. ఆహారం తీసుకోదు. పని చేసే శక్తి కూడా తగ్గుతుంది. మేత మేయడం తగ్గిస్తాయి. దీనివల్ల పాల ఉత్పత్తి తగ్గుతుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది.
లంపీ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నది. ప్రభుత్వ ఆదేశంతో ప్రతి పశువుకూ గోట్ ఫాక్స్ వ్యాక్సిన్ వేస్తాం. పాడి రైతులు పశువులకు వైరస్ సోకితే ఇతర పశువులకు దూరంగా ఉంచాలి. పాలు పితకడం నిలిపివేయాలి. నాగర్కర్నూల్ జిల్లాలో 2.23లక్షల పశువులకుగానూ ఇప్పటి వరకు 150పశువులకు వైరస్ సోకగా 50వేల పశువులకు వ్యాక్సిన్ వేశాం. త్వరలో అన్ని పశువులకూ వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకుంటున్నాం.
– రమేశ్, జిల్లా పశువైద్యాధికారి, నాగర్కర్నూల్