పేదల జీవన ప్రమాణాల పెంపునకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా వారి ఆహార భద్రతకు పెద్దపీట వేశారు.రాష్ట్రంలో పీఎంజీకేఏవై పథకం అమలుకు నిర్ణయించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో పౌర సరఫరాల శాఖ బియ్యం పంపిణీకి చర్యలు చేపట్టారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో ఒక్కో లబ్ధిదారుడికి 10 కిలోల చొప్పున ఉచితంగా అందించనున్నారు. ఇప్పటికే 5కిలోల చొప్పున అందిస్తుండగా. మరో 5 కిలోల చొప్పున అదనంగా అందించనున్నారు. రెండ్రోజుల్లో రేషన్ దుకాణాల నుంచి పంపిణీ ప్రారంభంకావడంతో పేదలకు మరింత ఆహార భద్రత చేకూరనున్నది. దీంతో లబ్ధిదారుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
నాగర్కర్నూల్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : పేదల జీవన ప్రమాణాల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నది. పేదల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నది. ఆహార భద్రత పథకంలో భాగంగా రేషన్ దుకాణాల ద్వారా సాధారణ రోజుల్లో కిలో రూ.1 చొప్పున ప్రతి ఒక్కరికీ 6 కిలోల బియ్యం అందిస్తున్నది. కాగా, పీఎంజీకేఏవై పథకాన్ని రాష్ట్రంలో మరో మూడు నెలలు అమలు చేయనున్నారు. దీనిపై సీఎం కేసీఆర్ ఆదేశాలతో పౌర సరఫరాల శాఖ బియ్యం పంపిణీకి చర్యలు తీసుకున్నది. ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున బియ్యం అందజేయనున్నారు.
జిల్లాలో ఇటీవల బియ్యం పంపిణీ ప్రారంభమైంది. దసరా పండుగ ముగియడం, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు రేషన్ దుకాణాల వద్దకు తక్కువగా వస్తున్నారు. ఇప్పటికే 5 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేపట్టగా.. ప్రభుత్వ నిర్ణయంతో మరో 5 కిలోల బియ్యాన్ని అందజేయనున్నారు. దీనిపై డీలర్లు, స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా పేదలకు సమాచారం అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ బియ్యాన్ని అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో ఉచితంగా అందజేయనుండడం విశేషం. దీనిపై పేదల్లో సంతోషం వ్యక్తమవుతున్నది. ఇంతకుముందు కరోనా సమయంలో వలస కూలీలకు రూ.500, ప్రతి కార్డుకు రూ.1,500 చొప్పున రెండు నెలలు అందించారు.
ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకుండా కడుపునిండా భోజనం తినేలా సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. నాగర్కర్నూల్ జిల్లాలోని 461 గ్రామాల్లోని 558 రేషన్ దుకాణాల పరిధిలో 2.37 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో 2.18 లక్షల తెల్లకార్డులకుగానూ 9 వేల మెట్రిక్ టన్నులు, 18 వేల అంత్యోదయ కార్డులకుగానూ 923 మెట్రిక్ టన్నుల బియ్యం, 43 అన్నపూర్ణ కార్డులకు గానూ 595 మెట్రిక్ టన్నుల చొప్పున 8వేల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ జరుగుతున్నది. దాదాపుగా 7.53 లక్షల మందికి ప్రభుత్వం బియ్యం అందజేస్తున్నది. పేదల కోసం ఎంత ఆర్థిక భారమైనా ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుండడం విశేషం. సీఎం కేసీఆర్ ఆదేశాలతో జిల్లాలో మూడు నెలలపాటు ఉచిత బియ్యం పంపిణీ చేపట్టామని, ప్రతి నెలా ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున జిల్లాలో 2.33 లక్షల రేషన్ కార్డుల్లోని 7.55 లక్షల మందికి బియ్యం అందిస్తామని డీఎస్వో మోహన్బాబు తెలిపారు.