నాగర్కర్నూల్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : కొత్త జిల్లా కేంద్రాల్లోని జనరల్ దవాఖానల్లో వైద్య సేవలు మరింత మెరుగుపడనున్నాయి. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేయడంతోపాటు వ్యవసాయం, విద్య, సంక్షేమం, వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో నూతన జిల్లాల్లో మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లా కేంద్రాల్లో మెడికల్ కళాశాలలు ఏర్పడ్డాయి. వీటికి అనుగుణంగా దవాఖానలు సైతం అందుబాటులోకి వచ్చాయి. అప్పటికే ఉన్న ప్రభుత్వ జిల్లా దవాఖానలను జనరల్ ఆస్పత్రులుగా అప్గ్రేడ్ చేశారు. ప్రతి జిల్లా దవాఖానలో వివిధ విభాగాలకు అవసరమైన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల స్థాయి వైద్యులు అందుబాటులో ఉండి వైద్యం అందిస్తున్నారు. అయితే, అప్గ్రేడ్ అయినా తెలంగాణ వైద్య విధాన పరిషత్లోనే జనరల్ దవాఖానలు కొనసాగుతున్నాయి. దీంతో మెడికల్ కళాశాల, తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) వైద్యుల మధ్య సమన్వయం లోపిస్తున్నది.
మెడికల్ కళాశాలలకు వైద్యులు వచ్చినా నర్సింగ్ సిబ్బంది లేరు. దీంతో విధుల కేటాయింపు, పనులు చేయించడంపై పర్యవేక్షణ కొరవడింది. ఇది వైద్య సేవల లోపానికి కారణంగా మారుతున్నది. టీవీవీపీ పరిధిలోని డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది తమ ఇష్టానుసారం విధులకు వస్తున్నా.. తమ పరిధిలో లేరని మెడికల్ కళాశాల అనుబంధమైన జనరల్ దవాఖాన అధికారులు అజమాయిషీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో మెడికల్ కళాశాలలు వచ్చినా వైద్యం సరిగ్గా అందడం లేదన్న ప్రచారం జరిగే ఆస్కారం ఉన్నది. దీనిపై జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. స్పందించిన ప్రభుత్వం రెండు రోజుల కిందట జనరల్ దవాఖానలను టీవీవీపీ నుంచి డీఎంఈ పరిధిలోకి మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. టీవీవీపీ పరిధిలోని డాక్టర్లు, నర్సింగ్తోపాటు ఇతర సిబ్బందిని సమన్వయం చేసుకొనే అధికారం ప్రస్తుతానికి, డీఎంఈ చేతుల్లోకి రానున్నాయి. దీంతో విధుల కేటాయింపులో జనరల్ దవాఖానల సూపరింటెండెంట్లకు అవగాహన ఏర్పడనున్నది. గతంలో ఎవరు విధుల్లో ఉన్నారో, ఉంటారో, ఉండరో చెప్పలేకపోయారు. ఇకపై డీఎంఈ పరిధికి రావడంతో పరిపాలన మెరుగుపడనున్నది. ఈ క్రమంలో టీవీవీపీ దవాఖానల పర్యవేక్షణకు ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. నాగర్కర్నూల్, మహబూబ్నగర్, వనపర్తి జిల్లాల్లోనూ తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆస్పత్రుల పర్యవేక్షణకు కొత్త కార్యాలయాలు రానున్నాయి.
మెరుగు కానున్న పాలన..
జనరల్ దవాఖాన టీవీవీపీ నుంచి డీఎంఈకి రావడం సంతోషకరం. దీంతో వైద్యులు, ఇతర సిబ్బందికి విధుల కేటాయింపులో స్పష్టత వస్తుంది. జనరల్ దవాఖానల పరిపాలన నేరుగా డీఎంఈ రమేశ్ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. గతంలో టీవీవీపీ, జనరల్ దవాఖానల వైద్యులు, సిబ్బంది మధ్య సమన్వయ లోపం ఉంటున్నది. ఇప్పుడు ఆ సమస్య తీరుతుంది.
– డాక్టర్ రఘు, జనరల్ దవాఖాన సూపరింటెండెంట్, నాగర్కర్నూల్
కొత్త కార్యాలయం ఏర్పాటు..
జనరల్ దవాఖానలు డీఎంఈ పరిధిలోకి వెళ్లనుండడం తో టీవీవీపీ దవాఖానల పర్యవేక్షణకుగానూ కొత్త కార్యాలయం ఏర్పాటు చేయాల్సి ఉన్నది. జిల్లాలోని అచ్చంపేట, కొల్లాపూర్ ఏరియా దవాఖానలు, కల్వకుర్తి, లింగాల, అమ్రాబాద్, ఉప్పునుంతల పర్యవేక్షణ జనరల్ దవాఖాన నుంచి మార్చాలి. ఈ కార్యాలయం ద్వారా ఆ దవాఖానల పర్యవేక్షణ, డాక్టర్లు, ఇతర సిబ్బంది విధులు, కార్యకలాపాలు నిర్వహించాలి. దీనిపై కలెక్టర్కు వివరాలు సమర్పించడం జరుగుతుంది.
– డాక్టర్ రమేశ్ చంద్ర, జిల్లా దవాఖానల సమన్వయకర్త, నాగర్కర్నూల్