ఖిల్లాఘణపురం, సెప్టెంబర్ 15: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆసరా పథకం లబ్ధిదారులకు ఆర్థిక భరోసానిస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ప్రతి పైసా పేదల సంక్షేమం, అభివృద్ధి కోసమే ఖర్చు చేస్తున్నదని చెప్పారు. గురువారం వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం, సోలీపూర్లో నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ కార్డులను లబ్ధిదారులకు జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డితో కలిసి మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా కారణంగా కొత్త పింఛన్ల మంజూరు ఆలస్యమైందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో వృద్ధులకు రూ.2,016, వికలాంగులకు రూ.3,016 పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో 40 లక్షల పింఛన్దారులు ఉండగా.. కొత్తగా మరో 10 లక్షల మందికి అందించనున్నట్లు చెప్పారు. 57 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ అందిస్తామని, అర్హులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని చెప్పారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, అందుకే కర్షకులకు రైతుబంధు, రైతుబీమా, నిరంతర విద్యుత్, సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పింఛన్దారుల సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.
దివ్యాంగుడిని పలుకరించి..హామీ ఇచ్చి..
పింఛన్ కార్డుల పంపిణీకి హాజరైన మంత్రి నిరంజన్రెడ్డి సమావేశంలో కూర్చున్న వికలాంగుడు చెన్నురు శేషయ్య వద్దకు వెళ్లి పలకరించారు. తన సమస్యలను అడిగి తెలుసుకున్నాడు. శేషయ్య తనకు మూడు చక్రాల స్కూటీ కావాలని మంత్రిని కోరగా వెంటనే స్పందించి స్కూటీని ఇస్తానని హామీ ఇచ్చినట్లు శేషయ్య తెలిపారు. అలాగే ఖిల్లాఘణపురం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం, వసతుల కల్పనకు రూ.కోటీ 17 లక్షల పనులను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.