మక్తల్ టౌన్, ఆగస్టు 19 : ప్రజాప్రస్థానం యాత్ర పేరుతో రోడ్లపై చేతులు ఊపుకుంటూ తిరుగుతున్న వై ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిలకు తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని టీఆర్ఎస్ నేత మహిపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం పట్టణంలోని ఎమ్మెల్యే చిట్టెం నివాసగృహంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో ప్ర జలు ఛీ కొడితే తెలంగాణ ప్రాంతానికి షర్మిల వచ్చిందన్నారు. సొంత అన్న వద్ద ఇమడలేక ఇక్కడికొచ్చిన నీవు ఓ తెలంగాణ బిడ్డగా ఉండాలే తప్పా రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేయొద్దన్నారు. మక్తల్ నియోజకవర్గంలో యాత్రను చేపట్టిన ఆమె వెంట నడిచేది డబ్బులిస్తే వచ్చిన జనాలే అన్నారు. ఆమెకు తెలంగాణ ప్రభుత్వాన్ని, అభివృద్ధిని విమర్శించే హక్కు లేదన్నారు. రాష్ట్రంలో ఆడపిల్లలను గౌరవించే సంస్కృతిని సీఎం కేసీఆర్ కల్పించారని తెలిపారు. లేనిపోని విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. యా త్రలో నీకే దిక్కులేదు.. ఆడపడుచు అన్న మర్యాదను ఇక్కడి ప్రజలు ఇచ్చారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ పాలన అద్భుతంగా ఉన్నదని, యావత్ ప్రపంచమే కొనియాడుతున్నదని తెలిపారు. సమావేశంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అమరేందర్రెడ్డి, నర్సింహులుగౌడ్, కౌన్సిలర్లు రాములు, మొగులప్ప, నాయకులు రామలింగం, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.