కృష్ణా, తుంగభద్ర నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. జూరాల డ్యాం 7 గేట్ల నుంచి నీటి విడుదల చేస్తుండగా.. శ్రీశైలం జలాశయం ఒక్క గేటు తెరుచు కున్నది. కర్ణాటకలోని టీబీ డ్యాం20 గేట్ల నుంచి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. ఆర్డీఎస్, సుంకేసులకు వరద నమోదవు తున్నది. జూరాల, శ్రీశైలంలో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది. అలాగే ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల భారీవర్షం కురిసింది. వాగులు పొంగడంతోరాకపోకలు నిలిచిపోయాయి. గద్వాల జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు.
శ్రీశైలం, ఆగస్టు 4: కృష్ణా, తుంగభద్ర నదులకు వరద నమోదవుతున్నది. ఎగువ నుంచి నీటి ఉధృతి కొనసాగుతున్నది. దీంతో శ్రీశైలం జలాశయం ఒక్క గేటును 10 అడుగుల మేర ఎత్తి నాగార్జునసాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది రెండోసారి డ్యాం గేట్లను తెరిచారు.
గురువారం ఉదయం జూరాల ప్రాజెక్టు స్పిల్వే నుంచి 28,469 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి నుంచి 41,937క్యూసెక్కులు, సుంకేశుల ప్రాజెక్టు నుంచి 1,24,504క్యూసెక్కులు, హంద్రీ నుంచి 250 క్యూసెక్కులు మొత్తం కలిపి 1,95,160 క్యూసెక్కులు విడుదలైంది. దీంతో సాయంత్రం 6 గంటల వరకు రిజర్వాయర్కు 2,21,546 క్యూసెక్కులు ఇన్ఫ్లోగా నమోదైంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకుగానూ 884.10 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి సామర్థ్యం 215 టీఎంసీలకుగానూ 210.5133 టీఎంసీలుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.
కుడిగట్టు విద్యుత్ కేంద్రానికి 30,460 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రానికి 31,784 క్యూసెక్కులు.. గేట్ల నుంచి విడుదలైన మొత్తం కలిపి 89,906 క్యూసెక్కులు అవుట్ఫ్లోగా నమోదైంది. ఏపీ పవర్హౌస్లో 16.482 మిలియన్ యూనిట్లు, టీఎస్ పవర్హౌస్లో 17.136 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
అమరచింత, ఆగస్టు 4 : జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. దీంతో 7 గేట్ల నుంచి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. 81,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. 41,222 క్యూసెక్కులను విద్యుదుత్పత్తికి వినియోగిస్తున్నారు. ఎడుమ కాల్వకు 1,060 క్యూసెక్కులు, కుడి కాల్వకు 536 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 300 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మొత్తం 85,233 క్యూసెక్కులు అవుట్ఫ్లోగా నమోదైంది.
అయిజ, ఆగస్టు 4 : కర్ణాటకలోని టీబీ డ్యాంకు వరద ఉధృతి కొనసాగుతున్నది. దీంతో 20 గేట్లు ఎత్తి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 72,4343 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 61,4465 క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తిస్థాయి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా ప్రస్తుతం 101.031 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నీటిమట్టం 1633 అడుగులకుగానూ ప్రస్తుతం 1631.81 అడుగులకు చేరినట్లు డ్యాం ఎస్ఈ శ్రీకాంత్రెడ్డి, సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు.
అలాగే ఆర్డీఎస్ ఆనకట్టకు వరద కొనసాగుతున్నది. ఇన్ఫ్లో 97,880 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 97,400 క్యూసెక్కులుగా నమోదైంది. ఆయకట్టుకు 480 క్యూసెక్కులు చేరుతున్నట్లు ఆర్డీఎస్ ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం ఆనకట్టలో 12.8 అడుగుల మేర నీటిమట్టం నమోదైనట్లు తెలిపారు.