పెండ్లికి అంగీకరించని అమ్మాయి తల్లిదండ్రులు
ప్రజాప్రతినిధుల సమక్షంలో వివాహం
తిమ్మాజిపేట, మే5: ప్రేమకు ఏదీ అడ్డుకాదని.. మనసులు కలిస్తే చాలనే మాట మరోసారి రుజువైంది. పుట్టుకతోనే రెండు కాళ్లు, చేతులు లేని ఒక దివ్యాంగుడిని ప్రేమించి పెండ్లి చేసుకుందో యువతి. వివరాల్లోకి వెళితే.. తిమ్మాజిపేట మండలం మాన్యానాయక్ తండాకు పంచాయతీలోని చౌటచెరువుతండాకు చెందిన శంకర్కు పుట్టకతోనే రెండు కాళ్లు, చేతులు లేవు. అతని సోదరి దివ్యాంగురాలే. శంకర్లో పట్టదల ఎక్కువే. వైకల్యం ఉన్న కష్టపడి చదవి టీటీసీ పూర్తి చేశాడు. జడ్చర్ల డిగ్రీ కళాశాలలో డిగ్రి ద్వితీయ సంవత్సరం చదువుతున్న క్రమంలో భూత్పూర్ మండలం రాందాస్ తండాకు చెందిన సునీతతో పరిచయమైంది. చూడగానే నచ్చడంతో శంకర్ తన ప్రేమ విషయాన్ని సునీతకు చెప్పగా ఆమె అందుకు అంగీకరించింది. అయితే సినిమాలో ట్విస్ట్ లాగా అమ్మాయి తల్లిదండ్రులు వారి ప్రేమకు అంగీకరించలేదు. దీంతో అమ్మాయి తాను పెళ్లంటూ చేసుకుంటే శంకర్నే చేసుకుంటానని పట్టబట్టింది. ఈవిషయం మరికల్ సర్పంచ్ హనుమంతుయాదవ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి, మాన్యానాయక్ తండా సర్పంచ్ రమేశ్ దృష్టికి తీసుకెళ్లగా వారు ఇరువురు కుటుంబాల తల్లిదండ్రులతో మాట్లాడిప్పటికీ సునీత తల్లిదండ్రులు మాత్రం ఒప్పుకోలేదు. దీంతో బుధవారం వట్టెంలోని నారదగిరి వేంకటేశ్వరస్వామి ఆలయంలో వారి వివాహం జరిగింది. పెండ్లికి హాజరైన బంధువులు, ప్రజాప్రతినిధులు వధూవరులని ఆశీర్వదించారు.