శ్రీశైలం, ఫిబ్రవరి 17 : శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏడో రోజైన శుక్రవారం ఉదయం చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చన, శివపంచాక్షరీ, జపానుష్టానాలు, రుద్రపారాయణలు, రుద్ర, చండీహోమం జరిపించినట్లు ఈవో లవన్న తెలిపారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన గజ వాహనంపై భ్రామరి సమేత మల్లికార్జున స్వామిని వేంచేబు చేసి అక్కమహాదేవి అలంకార మండపంలో షోడశోపచార పూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాలు, డప్పుచప్పుళ్ల మధ్య క్షేత్ర వీధుల్లో ఊరేగించారు. గ్రామోత్సవం నయనానందకరంగా సాగింది. చెంచు కళాకారుల జానపదాలు, కోలాటాలు, రాజభటుల వేషాలు, జాంజ్ పథక్, గొరవ నృత్యం, బుట్టబొమ్మలు, బీరప్పడోలు, నందికోళ్ల సేవ, ఢమరుకం, చిడుతలు, శంఖం, చెక్కబొమ్మలు వివిధ రకాల విన్యాసాల సందడి మధ్య ఊరేగింపు సాగింది. ఆలయ మాడవీధిలోని భ్రామరీ కళావేదికతోపాటు పుష్కరిణి, శివదీక్ష శిబిరాల వద్ద ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కూచుపూడి, భరతనాట్యం, క థక్, హరికథ, బుర్రకథ, భక్తరంజని, నాటికలు అలరించాయి.
భక్తులు ఆసక్తిగా తిలకించారని పీఆర్వో శ్రీనివాసరావు తెలిపారు. స్వామి, అమ్మవారి కల్యాణానికి పాగాలంకరణ కోసం వడికిన పాగ మల్లన్న సన్నిధికి చేరినట్లు ఈవో తెలిపారు. కల్యాణం నాటికి సిద్ధం చేయడం ఆనవాయితీ అని ఆలయ స్థానాచార్యులు పూర్ణానందారాద్యులు తెలిపారు. స్వామి, అమ్మవారికి ఆలయ ధర్మకర్తల మండలి తరఫున పట్టువస్ర్తాలు సమర్పించారు. కార్యక్రమాల్లో ఆలయ ట్రస్ట్బోర్డ్ చైర్మన్ రెడ్డి వారి చక్రపాణిరెడ్డి, కార్యనిర్వాహణాధికారి లవన్నతోపాటు ధర్మకర్తల మండలి సభ్యులు, ఈఈ రామకృష్ణ, ఏసీ వెంకటేశ్వర్లు, పౌరసంబంధాల అధికారి శ్రీనివాసరావు, ఏఈవోలు హరిదాస్, ఫణీంద్రప్రసాద్, శ్రీశైల ప్రభ సంపాదకులు అనిల్కుమార్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయన్న, సూపరింటెండెంట్ రవి, స్వాములు, వెంకటేశ్వరులు, మధుసూదన్రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.