Telangana | మహబూబ్నగర్, జూలై 2 : మీ కల సాకారం చేసుకోండి.. మీతో మేమున్నాం అంటోంది ఓ గ్రంథాలయం. విజయతీరాలకు చేరే వరకు మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఉద్యోగాలు సాధించేందుకుగానూ గ్రంథాలయంతోపాటు ఎస్సీ, బీసీ స్టడీ సర్కిళ్లు అండగా నిలుస్తున్నాయి. గ్రంథాలయాలు 1960 కంటే ముందు నుంచే వినియోగంలో ఉన్నా.. నిర్వహణలో వెనకబడిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుని గ్రంథాలయాలను అప్గ్రేడ్ చేస్తూ అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి పుస్తకాన్ని పాఠకుల చెంతకు చేర్చుతూ ఉద్యోగాలు సాధించడంలో గ్రంథాలయాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు 15 గంటల పాటు పాఠకులకు గ్రంథాయాలు అందుబాటులో ఉంటున్నాయి. వీటితోపాటు ఎస్సీ, బీసీ స్టడీ సర్కిళ్ల నుంచి నిరుద్యోగులకు ఉచితంగా కోచింగ్ అందిస్తున్నారు. ఈ సెంటర్ల ద్వారా చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్ల తో ్వరా ఎంతో మేలు జరుగుతుందని అభ్యర్థులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా 15 గ్రంథాలయాలు ఉన్నాయి. జిల్లాకేంద్రంలోని మెట్టుగడ్డ వద్ద ఉన్న జిల్లా ప్రధాన గ్రంథాలయం ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటల వరకు పాఠకులకు అందుబాటులో ఉంటున్నది. ప్రతి రోజూ వెయ్యి మంది పాఠకులకు పైగా గ్రంథాయాల్లో ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు. జిల్లాలోని గ్రంథాలయాలకు 13,915 మంది సభ్యత్వం తీసుకోగా.. ఏడాదికి 2,99,340 మంది వాటిలో ప్రిపేర్ అవుతున్నారు. అభ్యర్థులకు అవసరమైన పుస్తకాలను గ్రంథాలయాల్లో ఉంచుతున్నారు. నిరంతరం తాగునీటిని అందిస్తూ మహిళలకు ప్రత్యేక గదిని అందుబాటులో ఉంచారు.
తెలంగాణ ప్రభుత్వం 2014 నుంచి బీసీ స్టడీ సర్కిల్ ద్వారా 2,183 మందికి కోచింగ్ ఇచ్చింది. అందులో 147 మంది కానిస్టేబుల్స్, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, ఎస్సైలు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, డీఎస్సీ, ఫారెస్టు బీట్ ఆఫీసర్లు, గురుకుల టీచర్లు, గ్రూప్స్లో డీటీ, కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, ఎక్సైజ్ ఎస్సైలు, జూనియర్ లైన్మెన్స్, జూనియర్ అసిస్టెంట్లు, బ్యాంకింగ్ ఉద్యోగులు, రైల్వేలో లోకో పైలెట్ ఉద్యోగాలు పొందారు. ఇప్పటివరకు 26 బ్యాచ్లకు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా కోచింగ్ ఇచ్చారు. గ్రూప్-1కు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులకు రూ.3,500, ఎస్సై, కానిస్టేబుల్కు రూ.1,600 విలువైన స్టడీ మెటీరియల్ ఉచితంగా అందిస్తున్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ వారికి రూ.5వేలు స్కాలర్షిప్తోపాటు మధ్యాహ్న భోజనం అందించారు. ప్రస్తుతం గ్రూప్-2, ఎస్సై, ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి కోచింగ్ కొనసాగుతున్నది.
ప్రభుత్వం ఎస్సీ స్టడీ సర్కిల్ను 2015లో ప్రారంభించింది. కాగా ఇప్పటివరకు 81 మంది ఉద్యోగాలు పొందారు. ఈ సెంటర్లో వెయ్యి మందికి పైగా ఉచితంగా కోచింగ్ ఇచ్చారు. అభ్యర్థులకు వసతితోపాటు భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నారు. ఈ స్టడీ సర్కిల్ ద్వారా రూ.2500 విలువైన స్టడీ మెటీరియల్, 12 నోట్ బుక్కులు అందిస్తున్నారు. స్కాలర్షిప్ బాలురకు రూ.100, మహిళలకు రూ.150 ఇస్తున్నారు. ప్లేట్, గ్లాస్, కటోర, బ్లాంకెట్స్, పిల్లో, బెడ్షీట్ ఇస్తారు. శ్రీనివాస్కాలనీ యోగి టిఫిన్ సెంటర్ పక్కన ప్రత్యేకంగా కోచింగ్ ఇస్తున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. స్టడీ కేంద్రం వద్దనే ప్రత్యేకంగా లైబ్రరీని ఏర్పాటు చేశారు. ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు ఇది అందుబాటులో ఉంటుంది. డే స్కాలర్లకు అంబేద్కర్ కళాభవన్లో కోచింగ్ ఇస్తున్నారు. రూ.1,500 విలువైన స్టడీ మెటీరియల్, రూ.2,250 స్కాలర్షిప్ అందిస్తున్నారు.
ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు గ్రంథాలయం ఓపెన్ చేసి ఉండడం చాలా సంతోషంగా ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యేందుకుగానూ గ్రంథాలయం అండగా నిలుస్తున్నది. అవసరమైన పుస్తకాలను అందిస్తున్నారు. ఇంతలా ప్రోత్సహించడం చాలా బాగుంది. గ్రంథాలయం సేవలు మరువలేనివి.
– విజయ్కుమార్, గ్రూప్స్నకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థి, మహబూబ్నగర్
ఎంతో తపనతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నా. గంటల తరబడి చదువుకునేందుకు గ్రంథాలయం అ నువుగా ఉంది. ప్రభుత్వం ఎంతో సహకరిస్తున్నది. ఉ ద్యోగం సాధించాలనే లక్ష్యంతో చదుతున్నా. గ్రూ ప్స్లో ఏదైనా ఒక ఉద్యోగం సాధిస్తా. నిరుద్యోగులు ప్రిపేర్ అయ్యేందుకు గ్రంథాలయంలో అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉన్నాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. మరింత మందికి ఈ గ్రంథాలయాన్ని చేరువ చేయాలి.
– మహేశ్, గ్రూప్స్నకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థి, పాలమూరు
కానిస్టేబుల్ కావాలనే తపనతో చదువుతున్నాను. ఉదయం నుంచి రాత్రి వరకు గ్రంథాలయం ఓపెన్ చేసి ఉంచడంతో ఎంతో మేలు కలుగుతున్నది. మహిళల కోసం ప్రత్యేకంగా ఓ గదిని కేటాయించి వారికి అవసరమైన ఫర్నిచర్ను సమకూర్చారు. ఇంట్లో చదివితే ఇబ్బంది ఉండేది. గ్రంథాలయంలో ప్రశాంతమైన వాతావారణంలో చదువుతున్నాను. ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం ఉంది.
– మహాలక్ష్మి, మహబూబ్నగర్
ఇంట్లో కూర్చొని చదవడానికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక్కడికి వచ్చి చదువుకోవడంతో ఎంతో మేలు కలుగుతున్నది. ఎలాంటి సమస్య లేకుం డా అనుకున్న స్థాయిలో పోటీ పరీక్షకు సిద్ధ మయ్యేందుకు అనుకూలంగా ఉంది. ఇష్టం వచ్చినంత సమ యం వరకు చదువుకుంటున్నాం. పెండ్లి అయినప్పటి కీ ఉద్యోగం సాధించాలనే తపన ఉన్న వారికి ఈ గ్రం థాలయం అనుకూలంగా ఉన్నది.
– కవిత, గ్రూప్స్నకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థి, మహబూబ్నగర్
బీసీ స్టడీ సర్కిల్లో ప్రభు త్వం ఉచితంగా శిక్షణ అం దించింది. క్రమం తప్పకుండా వెళ్లి శిక్షణ తీసుకు న్నా. స్టడీ మెటీరియల్తోపాటు టీ, స్నాక్స్ అందించారు. సమయాన్ని వృథా చేయకుండా ప్రణాళికతో శిక్షణ పొందడం వల్ల ఉ ద్యోగం సాధించాను.
– బి.హిమబిందు, పంచాయతీ కార్యదర్శి, పాలమూరు
ప్రభుత్వం అనుభవం కల్గిన వారితో కోచింగ్ అందిస్తున్నది. ఎలా ప్రిపేర్ కావాలనే విషయాన్ని కూడా వారు వివరించి చెబుతున్నారు. అధ్యాపకులు చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకొని చదివాను. ఉద్యోగం సాధించడంతో నా తల్లిదండ్రుల కల సాకారం చేయగలిగాను. డబ్బులు ఖర్చు పెట్టి కోచింగ్ పొందలేని పేద విద్యార్థుల కలను ప్రభుత్వం నెరవేర్చింది.
– స్వరూప, పంచాయతీ కార్యదర్శి, పాలమూరు