అచ్చంపేట రూరల్/అమ్రాబాద్, మే 19 : ఉమామహేశ్వర, చెన్నకేశవ, మద్దిమడుగు అంజన్న సాగునీటి ప్రాజెక్టులతో అచ్చంపేటను సస్యశ్యామలంగా చేయడమే లక్ష్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఉమామహేశ్వర లిఫ్ట్ ఫేజ్-1, ఫేజ్-2 నిర్మాణానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన సందర్భంగా శుక్రవారం పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియం నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే గువ్వలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్, విప్ గువ్వల బాలరాజు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. పదర, వంకేశ్వరం, అమ్రాబాద్, మన్ననూర్ గ్రామాల్లో అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గువ్వల బాలరాజు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో అచ్చంపేట ప్రాంతాన్ని సాగునీటితో పచ్చని పంటలతో కళకళలాడేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఉమా మహేశ్వర ఎత్తిపోతల పథకాన్ని రూ.1,534కోట్లతో నిర్మించి 57,200 ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. అప్పర్ప్లాట్గా పిలువబడే నల్లమల ప్రాంతమైన అమ్రాబాద్, పదర మండలాలకు సాగునీరు అందిస్తామన్నారు. ఫేజ్-2లో అమ్రాబాద్ మండలం మన్ననూర్ సమీపంలోని చెన్నకేశవ రిజర్వాయర్ను ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్ అచ్చంపేటలో పర్యటించి సాగునీటి ప్రాజెక్టు పనులకు భూమిపూజ చేయనున్నట్లు తెలిపారు. గతంలో 60ఏండ్లు పాలించిన నాయకులు ఈ ప్రాంతాన్ని బీడుగా మార్చారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలోనే అచ్చంపేట అభివృద్ధిలో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.
అంతకుముందు ఎమ్మెల్యే గువ్వల తెలంగాణతల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మద్దిమడుగు అంజన్నను దర్శించుకున్నారు. మన్ననూరు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసి మండలంలోని కొండపైనున్న ఉమామహేశ్వర క్షేత్రంలో అమ్మవారికి కుంకుమార్చన, పరమేశ్వరుడికి అభిషేకాలు చేశారు. కొండకింద రంగాపూర్ దర్గాతండా హజ్రత్ నిరంజన్ షేక్ షావలీ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు పోకల మనోహర్, మున్సిపల్ చైర్మన్ ఎడ్ల నర్సింహాగౌడ్, మద్దిమడుగు ఆలయ చైర్మన్ విష్ణుమూర్తి, ఉమామహేశ్వర ఆలయ చైర్మన్ కందురు సుధాకర్, ఎంపీపీ శాంతాబాయి, జెడ్పీటీసీలు రాంబాబు, మంత్య్రా, సర్పంచ్ లోక్యానాయక్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అరుణ, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు రాజేశ్వర్రెడ్డి, బీఆర్ ఎస్ మండల అధ్యక్షుడు పర్వతాలు, రవీందర్రెడ్డి, రాంబాబునాయక్, చెన్నకేశవులు, శారద తదితరులు పాల్గొన్నారు.
పదర మండలంలోని మద్దిమడుగుకు చెందిన కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సమక్షంలో బీఆర్ఎస్ట్లో చేరారు. గువ్వల వారికి గు లాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో నాయకులు వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, వెంకటేశ్, అంజి, రాగి తదితరులు ఉన్నారు.