అచ్చంపేట రూరల్ : ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ డెంగ్యూ (Dengue disease) నివారణ దినోత్సవ అవగాహన ర్యాలీని డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ తారసింగ్ ( Tarasingh ) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి లక్షణాలు, నివారణ గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండేలా ఆరోగ్య సిబ్బంది క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నినాదం ప్రకారం ప్రతి ఒక్కరూ వారివారి ఇంటిలో, ఇంటి ఆవరణలో, పరిసరాలల్లో ఉండే నీటి కుంటల్లో దోమ లార్వాలను గుర్తించి, వాటి తొలగించి శుభ్రపరచాలని సూచించారు. నీటి నిల్వలపై మూతలు పెట్టడం ద్వారా డెంగ్యూ వ్యాధి నివారించవచ్చని పేర్కొన్నారు. డెంగ్యూ వ్యాధి కారక క్రిమి ఫ్లెవీ వైరస్ గల ఆడ టైగర్ దోమ కుట్టడం ద్వారా మనుషులకు డెంగ్యూ వ్యాధి సంక్రమిస్తుందని వివరించారు.
దోమ కుట్టిన తర్వాత మూడు నాలుగు రోజులకు విపరీతమైన జ్వరం, తలనొప్పి, కంటి వెనకాల నొప్పి, కండరాలు , కీళ్ల నొప్పులు, వాంతులు ,విరేచనాలు, కడుపునొప్పి తదితర లక్షణాలతో బాధపడుతూ ఉంటారని తెలిపారు. ప్రాథమిక లక్షణాలను డెంగ్యూ వ్యాది నిర్ధారణ పరీక్షలు చేసుకోవడం ద్వారా డెంగ్యూ వ్యాధిని తొలి దశలోనే గుర్తించవచ్చని అన్నారు .
ఇంటి ద్రావణాలను , ఓఆర్ఎస్ ద్రావణాలను తీసుకోవడం , జ్వరం తగ్గడానికి పారాసెటమాల్ మాత్రలు వేయడం వల్ల డెంగ్యూ వ్యాధిని సులభంగా తగ్గించగలమని వెల్లడించారు. . ప్రాథమిక దశలో గుర్తించకపోవడం వల్ల శరీరంలోని మూత్రపిండాలు , కాలేయం, గుండె, మెదడు తదితర అవయవాలు తీవ్ర ప్రభావానికి గురవుతాయని తెలిపారు. ప్రజలు ప్రతి శుక్రవారం పోడిదినం(డ్రై డే) పాటించాలని కోరారు.
ఇంటి ఆవరణలో పనికిరాని టైర్లు ,ప్లాస్టిక్ మూతలు, సీసాలు,కొబ్బరి చిప్పలు, లేకుండా చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ప్రశాంత్, అచ్చంపేట డివిజన్ ఉప మలేరియా అధికారి బికులాల్, పర్యవేక్షకులు హనుమంతు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.