భూ భారతి ఆపరేటర్ల ఉద్యోగాలకు ఎసరు వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి ఆపరేటర్లుగా ఏజెన్సీ ద్వారా కాంట్రాక్ట్ పద్ధతిపై నియమితులైన ప్రస్తుత భూ భారతి ఆపరేటర్ల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. 15 నెలలుగా వేతనాలు రాకపోవడం.. చేస్తున్న ఆపరేటర్ ఉద్యోగాలను కూడా
ప్రభుత్వం తొలగించనున్నదనే ప్రచారం నేపథ్యంలో ఆందోళన చెందుతున్నారు. ఆపరేటర్లుగా కొనసాగించడం ఇష్టం లేకపోతే.. రెవెన్యూ కార్యాలయంలో మరో విధంగానైన తమ సేవలు ఉపయోగించుకొని ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందుకోసం ఆపరేటర్లు ఆందోళన బాట పట్టారు. ఉమ్మడి జిల్లా
లోని 81 మంది విధులకు హాజరుకాకపోడంతో రెండ్రోజులుగా భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.
– కల్వకుర్తి, ఆగస్టు 4
భూ భారతి ఆపరేటర్లు(ఫీల్డ్ తెలంగాణ స్టాఫ్) రెవెన్యూ కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తారు. భూముల క్రయ విక్రయాల్లో భూ భారతి సిస్టమ్ను ఆపరేట్ చేస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏజె న్సీ ద్వారా వీరిని నియమించారు. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్ను భూ భారతిగా మార్పు చేశారు. ఇక్కడ ఆపరేటర్లుగా పనిచేస్తున్న వారిని తొలగించి రెవెన్యూ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఉద్యోగులకు భూభారతి బాధ్యతలు అప్పగించేలా రాష్ట్ర ప్రభు త్వం జూనియర్ అసిస్టెంట్లకు శిక్షణనిస్తుంది. పరోక్షంగా ఆపరేటర్ల ను తొలగిస్తారనే వార్తలు కూడా వస్తున్నా యి. దీంతో తమ ఉద్యోగాలు కాపాడుకునేందుకు ఆపరేటర్లు సోమవారం నుంచి ఆందోళనకు శ్రీకారం చుట్టారు.
నాగర్కర్నూల్ జిల్లాలో 20 మంది భూభారతి ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. తమ ఉద్యోగాలు కాపాడుకోవడంలో భాగంగా సోమవారం తమ విధులు బహిష్కరించి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. మంగళవారం కూడా విధులు బహిష్కరించి రాష్ట్ర రాజధానిలోని సీసీఏల్ఏ వద్దకు వెళ్లారు. రాష్ట్రంలో దాదాపు 636 మంది ఎఫ్టీఎస్గా పనిచేస్తున్నారని, ఇందులో ఒకరిద్దరు తప్పుచేస్తే అందరినీ తొలగించే ఆలోచన చేస్తారా? అంటూ ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. 15 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని, ఇప్పుడేమో విధుల నుంచి తొలగించే విధంగా జూనియర్ అసిస్టెంట్లకు శిక్షణ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విధుల నుంచి తొలగిస్తే.. తమ కుటుంబాలు వీధిన పడతాయని వాపోయారు. తమను ఆపరేటర్లుగా కొనసాగించడం ఇష్టం లేకపోతే.. రెవెన్యూ కార్యాలయాల్లో ఇతర బాధ్యత ఏదైనా అప్పగించి ఉపాధి చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రెవెన్యూ కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ఉద్యోగులు భూ భారతికి సంబంధించిన శిక్షణను దాదాపుగా పూర్తి చేస్తున్నారు. బుధవారం వారికి మరోసారి శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ పూర్తయితే వారు రెవె న్యూ కార్యాలయాల్లో భూ భారతికి సంబంధించిన బాధ్యతలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రెండ్రోజులుగా భూ ముల రిజిస్ట్రేషన్లు బంద్ అయినవి.. ఇలా ఇంకా ఎన్నిరోజులు జరుగుతుందని ఓ రెవెన్యూ అధికారిని ప్రశ్నిస్తే.. అ దేం లేదు.. బుధవారానికి జూనియర్ అసిస్టెంట్లకు శిక్షణ పూర్తవుతుంది. గురువారం నుంచి వారు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంటుందంటూ సమాధానం ఇచ్చారు. ఇంతకాలం రెవెన్యూకు సంబంధించి పనులే కాకుండా సర్ పనులకు కూడా తమను వాడుకుని గొడ్డు చాకిరీ చే యించుకున్నారని.. ఇప్పుడేమో కూరలో కరివేపాకులా తీసివేస్తున్నారని ఆపరేటర్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మొత్తం మీద భూభారతి ఆపరేటర్లకు ఏ ప్రత్యామ్నాయం చూపకుండా ప్రభుత్వం మొండి ‘చెయ్యి’చూపిందని, ప్రజాపాలనలో ఇదంతా కామన్ అని ప్రజాస్వామిక వాదులు సెటైర్లు విసురుతున్నారు.
రెండ్రోజులుగా రిజిస్ట్రేషన్లు బంద్ కావడంతో భూముల క్రయవిక్రయదారులతోపాటు స్లాట్ బుక్ చేసుకున్న వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సోమవారం వస్తే బంద్ ఉంది.. మంగళవారం వస్తే బంద్ ఉందంటూ క్రయ విక్రయదారులు ఆవేదన వ్యక్తం చేశారు. స్లాట్ బుక్ చేసుకుని వచ్చామని, ఇక్కడకు వచ్చి చూస్తే ఈరోజు బంద్ అంటూ చావుకబురు చల్లగా చెప్పారని రైతులు వాపోయారు. ముందే వర్షాకాలం.. ఇప్పుడిప్పుడే అంతో ఇంతో వర్షాలు కురుస్తున్నాయి. వ్యవసాయం పనులు వదులుకుని వచ్చామని తొందరగా పోదామనుకుంటే అసలుకే ఎసరు వచ్చినట్లు అయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పనికి మరో రోజు రావాలి అంటూ గొనుక్కున్నారు.
