దేవరకద్ర రూరల్, (చిన్నచింతకుంట) డిసెంబర్ 12 : పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కార్తీక అమావాస్య సందర్భంగా మంగళవారం ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలిరావడంతో కురుమూర్తి గిరులు జనసంద్రమయ్యాయి. వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి బారులుతీరారు. భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా కురుమూర్తి స్వామిని ప్రజలు కొలుస్తారు.
ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి, కొత్త కుండలో నైవేద్యాలు తయారు చేసి స్వామివారికి సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారి దర్శనం కోసం మెట్ల ద్వారా వెళ్లి ఉద్దాల మండపంలో ఉద్దాలను దర్శనం చేసుకొని, గర్భగుడి వద్ద స్వామి దర్శనం చేసుకున్నారు. గోవింద నామస్మరణతో కాంచన గుహ మార్మోగింది. జాతరలో దుకాణాలు వివిధ రకాల స్వీట్లు, వస్తువుల కొనుగోలుతో సందడిగా కనిపించాయి.