గద్వాల, జూలై 28 : అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్, టీబీ,
జూరాల ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. పీజేపీ 22 గేట్ల నుంచి కృష్ణమ్మ పరుగులు పెడుతుండడంతో రైతుల సంతోషానికి అవధుల్లేవు. కోటి ఆశలతో వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 80 వేల ఎకరాల్లో వరి సాగు జోరందుకున్నది. రైతుబంధు సాయం అందడంతో
కర్షకులు మరింత ఉత్సాహంతో పంటలు సాగు చేస్తున్నారు.
కొన్ని రోజులుగా వర్షం కురుస్తుండడంతో రైతన్న మురిసి పోతున్నాడు. ఇప్పటికే వానకాలం సాగుకు పొలాలను సిద్ధం చేయగా ముసురు కు రుస్తుండంతో జిల్లాలోని రైతులు బిజీ బీజీ అయ్యారు. ఎగువన వర్షాలు కురుస్తుండడంతో జూరాలకు వరద చేరుతుండగా అధికారులు దిగువకు విడుదల చేయడం తో రైతులు సంబురంగా సాగుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో ఈ వానకాలంలో వివిధ పంటలు 3,83, 574 ఎకరాల్లో సాగు చేస్తారని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. అందులో వరి సుమారు 80వే ల ఎకరాల్లో సాగు చేయనున్నట్లు అంచనా.. వర్షాల రా కతో బోర్లు, బావుల వద్ద నారు మడులు పోసుకున్న రై తులు నాట్లు వేసుకుంటున్నారు. గత వానకాలం అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత సీజన్కు వ్యవసాయశాఖ అధికారులు అనువైన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నీరు చెరువులు, కుంటలకు చేరుకోవడంతోపాటు నెట్టెంపాడ్ లిఫ్ట్ ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. గత వానకాలంలో జి ల్లాలో వరి 88,144 ఎకరాల్లో సాగు చేశారు. ఈ వానకాలంలో ప్రత్యామ్నాయ పంటలైన పత్తి, ఇరత పంటల వైపు మొగ్గు చూపడంతో 80వేల ఎకరాల్లోనే వరి సాగు చేస్తారని అంచనా వేశారు. ఇప్పటికే బోరుబావుల కింద సుమారు 1,057 ఎకరాల్లో వరి పంట సాగు చేయగా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నారుమడులు పోసుకు న్న రైతులు నాట్లు వేస్తూ బిజీ అయ్యారు.
రైతుబంధుతో ఉత్సాహంగా..
ప్రభుత్వం వానకాలం సీజన్కు సంబంధించి విడుతల వారీగా గత నెల నుంచి రైతుబంధు సాయాని రైతుల ఖాతాల్లో జమచేసింది. దీంతో చిన్న, సన్నకారు రైతులు మరింత ఉత్సాహంగా సాగుకు సన్నద్ధమయ్యారు. వానకాలం సీజన్ ప్రారంభం నాటికి నగదు రైతుల ఖాతాల్లో జమ కాగా ఎరువులు కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుకున్నారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను అధికారులు సిద్ధంగా ఉంచడంతో జిల్లాలో సాగు సంబురంగా సాగుతున్నది.
ఈ సీజన్లో రైతులకు ఎరువుల కొతర లేకుండా చూడాలని కలెక్టర్ క్రాంతి ఆదేశించడంతో ఆ దిశగా అధికారులను ప్రణాళికలు సిద్ధం చేశారు. గత బుధవారం మానవపాడు మండలంలో కలెక్టర్ పర్యటించినప్పుడు రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయా? లేదా? అని గోదాంను పరిశీలించారు. మొత్తమ్మీద జిల్లాలో ముసురు వర్షాలు కురుస్తుండడంతో రైతులు తమ నాగళ్లకు పదును పెట్టి ముందుకు సాగుతున్నారు.
ఆల్మట్టికి 1,38,722 క్యూసెక్కుల ఇన్ఫ్లో
అయిజ, జూలై 28 : కర్ణాటకలోని కృష్ణా బేసిన్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. దీంతో డ్యాం గేట్లు ఎత్తి నారాయణపుర డ్యాంకు నీటిని విడుదల చేస్తున్నారు. శుక్రవారం ఆల్మట్టికి ఇన్ఫ్లో 1,38,722 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 1,25,000 క్యూసెక్కులుగా నమోదైంది. 129.72 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 87.737 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నారాయణపుర ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 1,15,500 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 1,14,200 క్యూసెక్కులుగా నమోదైంది. 37.640 టీఎంసీలకు గానూ 26.74 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
తుంగభద్ర డ్యాంకు వరద ..
టీబీ డ్యాంకు కూడా వరద పోటెత్తింది. శుక్రవారం డ్యాంలోకి ఇన్ఫ్లో 88,270 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 1,078 క్యూసెక్కులుగా నమోదైంది. డ్యాం నీటినిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా ప్రస్తుతం 62.060 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. 1,633 అడుగులకు గానూ ప్రస్తుతం 1,620.26 అడుగులకు చేరినట్లు డ్యాం సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు. హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ కాల్వలకు వెయ్యి క్యూసెక్కులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
ఆర్డీఎస్ ఆనకట్టకూ..
కర్ణాటకలోని ఆర్డీఎస్ (రాజోళి బండ డైవర్సన్ స్కీం) ఆనకట్టకు వరద మొదలైంది. ఎగువన కురుస్తున్న మోస్తరు వానలకు ఆర్డీఎస్కు ఇన్ఫ్లో చేరుతోంది. శుక్రవారం ఆనకట్టకు 1,527 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, 834 క్యూసెక్కులు కన్స్ట్రక్షన్ స్లూయిస్ ద్వారా సుంకేసుల బ్యారేజీకి వరద చేరుతుందని ఆర్డీఎస్ ఏఈ రాందాస్ తెలిపారు. ప్రస్తుతం ఆనకట్టలో 7.5 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. వరదతో ఆర్డీఎస్ ఆనకట్ట జలకళను సంతరించుకున్నది.