వనపర్తి టౌన్, సెప్టెంబర్ 26: వనపర్తి జిల్లాలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని, పట్టణానికి వన్నె తీసుకొచ్చేలా పనులు చేపడుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. 29వ తేదీన వనపర్తిలో ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ.10 కోట్లతో పట్టణ నడిబొడ్డున ఐటీ హబ్ను నిర్మిస్తున్నామన్నారు. పట్టణ శివారులో తెలంగాణ నిర్మాణ కలల సారథి జయశంకర్ సార్ గుర్తుగా చేపట్టిన జయశంకర్ రాక్ఉడ్ పార్కు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలవనున్నదన్నారు. అనంతరం సభాస్థలిని పరిశీలించారు. అలాగే క్యాంప్ కార్యాలయంలో ఖిల్లాఘణపురం, పెబ్బేరు మండలంలోని గుమ్మడం గ్రామాలకు చెందిన 250 మంది కాంగ్రెస్, టీడీపీ, బీజేపీకి చెందిన మహిళలు, నాయకులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
జిల్లా అభివృద్ధికి మంత్రి కేటీఆర్ రాకతో మరింత తోడ్పుటు కానున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలో మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభించుకొనే అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలకు చేపడుతున్న పనులను కలెక్టర్ తేజస్నంద్లాల్ పవార్, ఎస్పీ రక్షిత కే మూర్తితో కలిసి మంత్రి మంగళవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రూ.20కోట్లతో సమీకృత మార్కెట్, రూ.22కోట్లతో రాజభవనానికి మరమ్మతులు, పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల వసతిగృహాల నిర్మాణం,పట్టణ శివారులో జయశంకర్ రాక్ ఉడ్పార్కు ప్రత్యేక ఆకర్షణీయంగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వ్యవసాయ కళాశాలకు నూతన భవన నిర్మాణం, రూ.10కోట్లతో చేపట్టనున్న ఐటీహబ్ శంకుస్థాపనును 28తేదీలోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణలో రూ.666కోట్లతో 22పనులకు చేపట్టనున్న ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన పనులను అధికారులు ఒకరోజు ముందుగానే పూర్తియ్యేలా చేపడుతున్నారు.
సభాస్థలాన్ని పరిశీలించిన మంత్రి
జిల్లాలో ఈనెల 29న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా చేపట్టునున్న అభివృద్ధి ప్రారంభోత్సవ, శంకుస్థాపన అనంతరం మంత్రి కేటీఆర్ సభకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు మంత్రి ప్రత్యేక చొరువతో ప్రతిపనిని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సభా సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలన్న లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించి అధికారులకు ప్రత్యేక సలహాలు, సూచనలు చేశారు. కార్యక్రమంలో అడిషినల్ ఎస్పీ ఆనంద్రెడ్డి, మున్సిప్ల్ కమిషనర్ విక్రమ్సింహారెడ్డి, మార్కెటింగ్ అధికారి శ్వరన్సింగ్, పీఆర్ఈఈ ఈఈ మల్లయ్య, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్చైర్మన్ శ్రీధర్, మార్కెట్ చైర్మన్ రమేశ్గౌడ్, పీఆర్ ఇంజినీర్, మున్సిపల్ అధికారులు, బీఆర్ఎస్ కౌన్సిలర్స్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం అండ
రాష్ట్రంలోని మైనార్టీలను ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఖిల్లాఘణపురం, పెబ్బేర్ మండలంలోని గుమ్మడంకు చెందిన 250మంది వివిధ పార్టీలకు చెందిన మహిళలు, నాయకులకు మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన వెంకటస్వామి, నర్సింహ, బాబు, నందు, ఘనపురం సర్పంచ్ వెంకటరమణ, వార్డు మెంబర్ అజీం, గులాంఖాదర్, రహీం, ఆరీఫ్ పాల్గొన్నారు.
పేదలకు ఇల్లులేదనే లోటు తీరుస్తాం
అర్హులైన పేదలందరికీ ఇల్లు లేదనే లోటు తీరుస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని అమ్మపల్లిలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఈనెల 29న వనపర్తి జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన మంత్రి కేటీఆర్ పర్యటనకు ఊరుఊరున జనాలకు తరలించి సభను విజయవంతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. సమావేశంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్రెడ్డి, జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, మండలాధ్యక్షుడు రాజప్రకాశ్రెడ్డి పాల్గొన్నారు.