జడ్చర్ల, జనవరి 1 : రైతులు వ్యవసాయంతోపాటు అదనపు ఆదాయం సమకూర్చుకోవడానికి పాడిపరిశ్రమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వ్యవసాయంలో నష్టాలొచ్చినా పాడిలో ఆదాయం పొందుతున్నారు. పాడిపశువుల పెంపకం రైతులకు లాభసాటిగా మారింది. పాడిపరిశ్రమను ప్రోత్సహించేందుకు పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నది. పశుసంపదను అభివృద్ధి చేసి పాల ఉత్పత్తులను పెంచేందుకు ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహం అందిస్తున్నది. జిల్లాలో రైతులు వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తూ వస్తున్నారు.
అధికశాతం రైతులు వర్షాధారంపైనే ఆధారపడి పంటల సాగు చేస్తారు. వర్షాలు సమృద్ధిగా కురిస్తే పంటలు పండుతాయి. లేదంటే పంటలతోపాటు పెట్టుబడిని రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దీంతో రైతులు అప్పులపాలవుతారు. అప్పులభారం తగ్గించుకోవడానికి, కుటుంబ పోషణకు రైతులు వ్యవసాయంతోపాటు పాడిపశువులను పెంచుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం ఇబ్బందిగా మారడంతో అందరూ పాడిపరిశ్రమపై దృష్టి సారించారు. పాలు, పాలపదార్థాలను విరివిగా వాడుతుండడంతో మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.
పాడి రైతులకు రుణాలు
పాడిపరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రుణాలను అందిస్తున్నది. జడ్చర్ల మండలంలోని చిన్నఆదిరాల, పెద్ద ఆదిరాల, కొండేడు తదితర గ్రామాల్లో రైతులకు రుణాలు ఇచ్చి పాడిపశువులను అందజేశారు. దీంతో ప్రతి ఇంటికీ పాడి పశువులు ఉన్నాయి. జడ్చర్లతోపాటు పెద్ద ఆదిరాలలో (బీఎంపి) బల్క్మిల్క్ కూలింగ్ సెంటర్లు ఉన్నాయి. అదేవిధంగా గ్రామాల్లో మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పాలసేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
రోజుకు 20వేల లీటర్ల పాల సేకరణ
జిల్లాలో మొత్తం 126 పాలసేకరణ కేంద్రాల్లో రోజుకు 20వేల లీటర్ల పాలను సేకరిస్తున్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో విజయ డెయిరీకి చెందిన మూడు బల్క్మిల్క్ కూలింగ్ కేంద్రాలు ఉన్నాయి. జడ్చర్ల బల్క్మిల్క్ కూలింగ్ కేంద్రానికి దాదాపు 4,200లీటర్ల పాలు వస్తుండగా, పెద్ద ఆదిరాలలో ఉన్న కేంద్రానికి దాదాపు 4వేల లీటర్ల పాలు, మిడ్జిల్ మండలం బోయిన్పల్లిలో 4వేల లీటర్ల పాలను సేకరిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని బీఎంసీలో పాలను సేకరించి విజయ డెయిరీకి సరఫరా చేస్తున్నారు. ప్రసుత్తం విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు 50శాతం సబ్సిడీపై చొప్పజొన్నలను పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా 25శాతం సబ్సిడీపై కాల్షియం, 30శాతం సబ్సిడీపై దాణ, 50శాతం సబ్సిడీపై మినరల్ మిక్షర్ను అందజేస్తున్నారు.
బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ
బీఎంసీలకు పాలు పోసే రైతులకు ప్రతి 15రోజులకు ఒకసారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులను జమ చేస్తున్నారు. విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం లీటర్కు రూ.4 చొప్పున పోత్సాహకాన్ని అందజేస్తున్నది. వెన్నశాతానికి అనుగుణంగా రైతులకు డబ్బులను చెల్లిస్తున్నారు. ఆవుపాలు లీటర్కు రూ.35నుంచి రూ.41, గేదెపాలకు లీటర్కు రూ.35 నుంచి రూ.75వరకు చెల్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
పాడితో రైతులకు లాభం
వ్యవసాయంతోపాటు రైతులు పాడి పశువులను పెంచుకోవడం వల్ల లాభం చేకూరుతుంది. వ్యవసాయంపై ఆధారపడి జీవించే రైతులకు పంటలు పండకపోయినా పాలతో ఆదాయం లభిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో పాలకు మంచి డిమాండ్ ఉంది. అందుచేత ప్రతి రైతు పాడిపశువులను పెంచుకుంటున్నారు. పాడిపశువుల పోషణ రైతులకు ఎంతోమేలు చేస్తుంది.
– రాంచంద్రారెడ్డి, బూరెడ్డిపల్లి, జడ్చర్ల
పాడిపరిశ్రమకు ప్రోత్సాహం
పాలపరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం రైతులను అన్నివిధాలా ప్రోత్సహిస్తున్నది. రైతులకు పాడిపరిశ్రమపై అవగాహన కల్పించి పాల ఉత్పత్తిని పెంచుతున్నాం. విజయ డెయిరీకి పాలుపోసే రైతులకు ప్రతి 15రోజులకు ఒకసారి డబ్బులను బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నాం. అలాగే సబ్సిడీపై గడ్డి విత్తనాలు, దాణ, మినరల్ మిక్షర్, క్యాల్షియం అందిస్తున్నాం. విజయ డెయిరీకి పాలుపోసే రైతులకు సమాచారం అందించడానికి ప్రత్యేక యాప్ను ఏర్పాటు చేస్తున్నాం.
– కవిత, విజయ డెయిరీ జిల్లా మేనేజర్