ఊట్కూర్, డిసెంబర్ 6 : మక్తల్ నియోజకవర్గంలో నకిలీ పట్టా పాస్ పుస్తకాలతో ఊట్కూర్ ఎస్బీఐలో రూ.కోట్ల వ్యవసాయ రుణాలను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. అసలు నిందితులను గుర్తించాలని కలెక్టర్ హరిచందన రెవెన్యూ అధికారులను ఆదేశించడంతో ఈ వ్యవహారంలో డొంక కదలనున్నదని రైతులు భావిస్తున్నారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఊట్కూర్, మక్తల్, మాగనూర్ మండలాల్లో దాదాపు 300 మంది రైతుల పేర్లపై దళారులు రూ.3 కోట్ల రుణాలు స్వాహా చేసినట్లు ఎస్బీఐ ఉన్నతాధికారులు విచారణలో గుర్తించినట్లు సమాచారం. కాగా, నకిలీ పాస్పుస్తకాల వ్యవహారంలో అత్యధికంగా ఊట్కూర్ మండలంలోని 11 గ్రామాల్లో 267 మంది రైతుల పేర్లపై 2017, 2018 సంవత్సరంలో ఎస్బీఐ నుంచి డబ్బులు డ్రా చేశారు. దీనిపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. రెవెన్యూ సిబ్బందికి బ్యాంకర్లు అందించిన జీరాక్స్ పట్టా కాపీలతో వారం రోజులుగా గ్రామాల్లో రైతుల ఇండ్లకు వెళ్లి విచారణ చేస్తున్నారు. ఓ పక్క బ్యాంకు అధికారులు, మరో పక్క రెవెన్యూ అధికారులు విచారిస్తుండడంతో తమకు ఏ మాత్రం సంబంధం లేని రుణాల వ్యవహారంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు మక్తల్, ఊట్కూర్ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో సోమవారం మండలంలోని ఓబ్లాపూర్ గ్రామానికి చెందిన 23 మంది రైతులను తాసిల్దార్ కార్యాలయానికి పిలుపించుకొని అధికారులు విచారణ చేశారు. ఖాతా, సర్వే నంబర్, ఎకరాలు, గ్రామ శివారు వంటి వివరాలు సరిగ్గా ఉన్నప్పటికీ.. ఫొటోలు వేరే వారివి ఉన్నట్లు గుర్తించారు. అధికారుల విచారణతో ఈ వ్యవహారం త్వరలోనే కొలిక్కి రానున్నదని, పాత్రదారులు, సూత్రదారులు ఎవరనేది బట్టబయలు కావడం ఖాయమని ప్రజలు చర్చించుకుంటున్నారు. పూర్తి వివరాలను కలెక్టర్కు అందజేస్తామని అధికారులు తెలిపారు.