అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే కేసీఆర్ ప్రధాని కావాలి
విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
అచ్చంపేటటౌన్, జూన్ 14: దేశం మెచ్చిన నాయకుడు కేసీఆర్ అని, అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే కేసీఆర్ ప్రధాని కావాలని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ పార్టీ నాగర్కర్నూల్ అధ్యక్షుడు గువ్వల బాలరాజు అన్నారు. మంగళవారం అచ్చంపేట క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి పరిచాయన్నారు. ప్రధానమంత్రి మోడీ అన్ని రాష్ర్టాల్లో ఈ పథకాలను అమలు చేయలేక దేశాన్ని దోపిడీ దొంగలు, అదానీ, అంబానీ పెద్దల చేతుల్లో పెట్టారన్నారు. సొమ్ము చేసుకుంటూ ప్రజలపై సవతి ప్రేమను చూపుతున్నాడని విమర్శించారు. బీజేపీ పాలనలో విసిగి వేసారిన మిగతా రాష్ర్టాల ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ప్రత్యామ్నాయ పార్టీ అవసరమన్నారు.
తెలంగాణ తరహాలోనే అన్ని రాష్ర్టాలు అభివృద్ధి చేయాలని ఇందుకు తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆరే ప్రధానమంత్రి కావాలని అన్ని రాష్ర్టాల ప్రజలు, వివిధ పార్టీల నాయకులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. దేశ ప్రజల ఆకాంక్ష మేరకు త్వరలోనే సరైన సమయంలో ముఖ్యమంత్రి సరైన నిర్ణయం తీసుకుంటారన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్లకు ప్రజలు గోరీకడుతారన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు పోకల మనోహర్, మార్కెట్ కమిటీ చైర్మన్ సీఎంరెడ్డి, జెడ్పీటీసీలు మంత్రియానాయక్, ప్రతాప్రెడ్డి, బల్మూర్ ఎంపీపీ అరుణమ్మ, మాజీ మున్సిపల్ చైర్మన్ తులసీరాం, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు రాజేశ్వర్రెడ్డి, కౌన్సిలర్లు రమేశ్రావు, అంతటి శివ, తగరం శ్రీను, బల్మూర్ మాజీ ఎంపీపీ కరుణాకర్రావు టీఆర్ఎస్ నాయకులు అమీనొద్దీన్, హుస్సేన్, వంశీనాయక్ పాల్గొన్నారు.