World Tailors Day | బాలానగర్/మహబూబ్నగర్, ఫిబ్రవరి 27 : మారిన ఫ్యాషన్ ప్రపంచంలో దర్జీలకు దర్జా లేదు..! రెడీమెడ్ రంగం విస్తరించడంతో టైలరింగ్కు గిరాకీ తగ్గిందని, పరిస్థితి దయనీయంగా మారిందని దర్జీలు పేర్కొంటున్నారు. టైలర్ దుకాణాల కుట్టు కుదేల్ అవుతున్నది. ప్రభుత్వం సబ్సిడీ రుణాలు, ఉచిత కరెంట్ అందించాలని కోరుతున్నారు. వారి జీవితాలకు టైలరింగే అధారంగా మారింది. ఏండ్ల్ల తరబడిగా కుట్టులోనే జీవితాలను గడుపుతూ అద్దె ఇండ్లల్లో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. పూటకు ఐదువేళ్లు నోట్లోకి వెళ్తున్నా.. జీవితానికి భద్రత మాత్రం శూన్యం. ఆరోగ్య సమస్యలు సైతం వెంటాడుతుండటం, కంటిచూపు దెబ్బతినడంతో భవిష్యత్ అంధకారంగా మారింది. కొంతకాలం కిందట రెడీమేడ్ వస్ర్తాలతో గిరాకీలు తగ్గినా ఇప్పుడిప్పుడే మళ్లీ టైలరింగ్కు డిమాండ్ పెరుగుతూ వస్తోంది. పూర్వకాలంలో పద్మశాలీలు మాత్రమే వస్ర్తాలు కుట్టేవారు. ప్రస్తుతం అన్నివర్గాల వారు టైలరింగ్లో ప్రావీణ్యం సంపాదించుకున్నారు. టైలరింగ్ వృత్తిపైనే ఆధారపడి పిల్లలను ఉన్నత చదువులు చదివించడంతోపాటు పెండ్లిళ్లు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
నిత్యం గంటల తరబడి కుట్టుమిషన్పై కూర్చొని దుస్తులు కుట్టాల్సి రావడంతో టైలర్లను అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రధానంగా కంటిచూపు దెబ్బతింటుంది. కంటిచూపుతోపాటు వెన్ను నొప్పి, మోకాళ్లు, ఆర్థో సమస్యలు పెరుగుతున్నాయి. కూర్చొని ఉండటం వల్ల కొందరికి స్థూలకాయ సమస్య సైతం వేధిస్తున్నది. అనారోగ్య సమస్యల వల్ల మధ్య వయస్సు రాగానే వృద్ధాప్యం వచ్చినట్లుగా బాధిస్తుందని టైలర్లు వాపోతున్నారు. ముఖ్యంగా సమయానికి దుస్తులు ఇవ్వాలనే ఒత్తిడి కారణంగా మానసిక సమస్యలు సైతం పెరుగుతున్నాయని టైలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే పట్టణాల్లో కుట్టుమిషన్ కేంద్రాలు ఉంటాయి కాబట్టి పల్లెటూళ్ల వారు అక్కడికి వచ్చి అద్దె ఇళ్లలో నివాసం ఉంటూ చాలీచాలని ఆదాయంతో కాలం వెళ్లదీస్తున్నారు. యజమానులు, వర్కర్లలో వేళ్లపై లెక్కించే మందికి మాత్రమే సొంత ఇండ్లు ఉన్నాయి. మిగిలిన వారంతా అద్దె ఇంట్లోనే జీవితాలు సాగిస్తున్నారు. టైలర్స్ దుకాణాలకు కరెంట్ను సబ్సిడీపై ఇవ్వడం, శిక్షణా తరగతుల ఏర్పాటు చేయడం వంటి పథకాలు ఉన్నప్పటికీ అవి ఎక్కడా అమలు జరుగుతున్న దాఖలాలు లేవు.
167ఏండ్ల కిందట సూదీ, ధారం ఉపయోగించి చేతితో తమకు అవసరమైన రీతిలో దస్తులను కుట్టుకునే రోజులవి. జర్మనీ దేశానికి చెందిన విలియమ్స్ హౌవే తన భార్య దుస్తులు కుట్టుకునేందుకు పడుతున్న అవస్థలు ప్రత్యేకంగా గమనించాడు. ఎలాగైన కుట్టుమిషన్ ఉంటే బాగుంటుందని దాదాపు 11నెలలపాటు శ్రమించాడు. 1846లో ఫిబ్రవరి 28న కుట్టుమిషన్ను కనిపెట్టాడు. అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా కుట్టుమిషన్లు వినియోగంలోకి వచ్చాయి. ఫిబ్రవరి 28న ప్రపంచవ్యాప్తంగా దర్జీల దినోత్స వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు.
రెడీమెడ్ రంగం విస్తరించడంతో టైలర్ల జీవితాలు కష్టంగా మారాయి. టైలరింగ్ తప్ప మరే పనిరాదు. చాలా కష్టపడి కుట్టడం నేర్చుకున్నాము. పండుగలు వస్తే తప్ప గిరాకీలు ఉండడం లేదు. చాలామంది రెడీమెడ్ దుస్తులకు అలవాటు పడ్డారు. అవసరమైన వారికి, తెలిసిన వారికి కుడుతున్నాము.
– మహ్మద్ ఖద్దూస్, టైలర్, మహబూబ్నగర్