మాగనూరు : మేకలు, గొర్రెలు దొంగతనాలు ( Sheep Thieves ) చేస్తున్న దొంగలను పట్టుకునే ప్రయత్నంలో హెడ్ కానిస్టేబుల్ ( Head Constable ) కు గాయాలైన ఘటన మాగనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మాగనూరు, కృష్ణ ఉమ్మడి మండలాల్లో జరుగుతున్న మేకలు, గొర్రెలు దొంగతనాలను అరికట్టేందుకు పోలీసులు రాత్రి వేళలో గస్తీలు నిర్వహిస్తున్నారు.
గుడిగండ్ల గ్రామానికి చెందిన గొర్రెల కాపర్లు తమ గొర్రెలను విక్రయించేందుకు రాయచూరు వైపు వెళ్తూ మార్గమధ్యలో మాగనూరు లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ సమీపంలో విశాంత్రి తీసుకున్నారు. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి అక్కడ ఉన్న గొర్రెలను దొంగిలించే ప్రయత్నం చేస్తుండగా అటుగా వచ్చిన పోలీసులను చూసి పారిపోయారు. పోలీసులు కారును వెంబడిస్తూ సమీప పోలీసులను అలర్ట్ చేశారు.
పోలీసులను చూసిన దొంగలు కారును వెనక్కి మళ్లించి పారిపోతుండగా పోలీసులు మాగనూరు పోలీస్ స్టేషన్ సమీపంలో బస్సును, లారీని రోడ్డుకు అడ్డంగా పెట్టి కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కారు వేగంగా వచ్చి బస్సును బలంగా ఢీ కొంది. అక్కడే ఉన్న హెడ్ కానిస్టేబుల్ అర్జున్ దొంగను పట్టుకునే యత్నంలో దొంగ బలంగా నెట్టేసి పారిపోయాడు. దీంతో హెడ్ కానిస్టేబుల్ తలకు, కాలుకు, చేతికి బలంగా గాయాలు అయ్యాయని ఎస్సై అశోక్ బాబు తెలిపారు.
హెడ్ కానిస్టేబుల్ ను చికిత్స నిమిత్తం మొత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నామని వివరించారు. కారును స్వాధీనం చేసుకుని, కారులో ఉన్న కత్తి, స్క్రూ డ్రైవర్, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్వు వివరించారు.