కల్వకుర్తి, ఫిబ్రవరి 10 : అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో అన్న సామెత ఊర్కొండ మండలం ఊ ర్కొండపేట అభయాంజనేయ స్వామి ఆలయ పూజారులకు సరిగ్గా అతికినట్లు సరిపోతుంది. తమకు నచ్చిన వా రు.. కాసులు ఇచ్చే వారికి పెద్దపీట వేస్తూ.. సామాన్య భక్తులకు చుక్కలు చూపిస్తున్నారనే విమర్శలను వారు మూటగట్టుకుంటున్నారు. ఆలయ పూజారులు తమకు ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఆలయ నిర్వహణ అంతా దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నా.. ఇక్కడ మాత్రం పూజారులదే పెత్తనం అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూజారులను ప్రక్షాళన చేస్తే తప్ప మరో మార్గం లేదని భక్తులు పేర్కొంటున్నారు.
బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు
వారం రోజులుగా అంజన్న బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలకు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. అయితే ఆలయంలోని పూజారుల తీరుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డబ్బులిచ్చేవారు.. తెలిసిన వారు వస్తే వారిని గర్భగుడిలోకి ఆహ్వానించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. సామాన్య భక్తులు మాత్రం క్యూలో గంటల కొద్దీ వేచి ఉండి స్వామిని దర్శించుకోవాల్సి వస్తుంది. ఇదేమని అడిగితే మీ ఇష్టం ఉంటే ఉండండి.. లేకుంటే వెళ్లిపోండని సమాధానం చెబుతున్నారని పలువురు భక్తులు వాపోతున్నారు. మరో విచిత్రమైన విషయం ఏమిటంటే ఆలయానికి వచ్చిన భక్తులను ఒకరిద్దరు మినహా మిగతా పూజారులు దక్షిణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దక్షిణ ఇవ్వకుంటే కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని భక్తులు మండిపడుతున్నారు. భక్తితో స్వామిని దర్శించుకుందామని వస్తే.. కాసులిస్తేనే పట్టించుకుంటారా..? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్వహణపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సత్యనారాయణ స్వామి వ్రతాల్లోనూ దోపిడీ
ఆలయంలో ప్రతి నిత్యం స త్యనారాయణ స్వామి వ్రతాలను భక్తులు ఆచరిస్తారు. మంగళ, శని వారాల్లో వ్రతాల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. వ్రతాల్లో పూజారుల దోపిడీ అంతా ఇంతా కాదు. వ్రతం ఆచరించిన వారి నుంచి ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేస్తారు. సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడానికి దేవాదాయ శాఖ కౌంటర్లో రూ.200 చెల్లించి రసీదు తీసుకోవాలి. ఇందుకుగానూ వ్రతాలను పూజారులు చేయించాలి. వ్రతం పూర్తయిన తర్వాత స్వామి వారి పీటను కదిలించాల్సి ఉంటుంది. ఈ సమయంలో వారు అడినంత డబ్బులు ఇవ్వకపోతే వ్రతం పీటను కదిలించరు. అంతలా వారి డిమాండ్ ఉంటుంది.
దేవాదాయ శాఖకు చెందిన పూజారి ఒక్కరే..
అభయాంజనేయ స్వామి ఆలయంలో దేవాదాయ శాఖకు చెంది న పూజారి ఒక్కరే ఉన్నారు. మి గతా పూజారులు తాత్కాలిక పద్ధతిన పనిచేస్తున్న వారే. టెంపరరీ పూజారులదే ఇక్కడ పెత్తనమం తా. దేవాలయ శాఖ అధికారులనే బెదిరించిన సం ఘటనలు ఉన్నాయి. గతంలో ఆలయ ఉద్యోగి ఒకరు తాత్కాలిక పూజారిపై కల్వకుర్తి పోలీస్ సర్కిల్ కార్యాలయంలో కేసు కూడా పెట్టాడు. ఇక్కడి వారి తీ రుపై నియోజకవర్గ ఉన్నత స్థాయి ప్రజాప్రతినిధి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత పూజారులపై చర్యలు తీసుకోవాలని ఎండోమెంట్ అధికారులకు చెప్పినట్లు సమాచా రం. ఆలయ హుండీలో కన్నా.. పూజారులకు దక్షిణలే ఎక్కువగా వస్తున్నాయనే వార్తలకు బలం చేకూరే ఉదాహరణలను ఎండోమెంట్ అ ధికారులకు ఇ చ్చినట్లు స మాచా రం.
పూజారులపై ఫిర్యాదులు నిజమే..
ఆలయంలో పనిచేస్తున్న కొంత మంది పూజారులపై ఫిర్యాదులు వస్తున్నది నిజమే. పూజారుల పనితీరుపై ఎండోమెంట్ ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చాం. బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే చర్యలు తీసుకుంటాం. ఆలయం వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి చర్యలు తీసుకుంటాం. ఉత్సవాలు ముగిసిన వెంటనే ప్రక్షాళన చేపడుతాం.
– సత్యచంద్రారెడ్డి, ఈవో, ఊర్కొండపేట అభయాంజనేయ స్వామి ఆలయం