మంత్రాలయం, ఫిబ్రవరి 20: తుంగభద్ర నదీతీరాన వెలిసిన విశ్వగురువు ప్రహ్లాదరాయ స్వరూపులు రాఘవేంద్రస్వామి సశరీర బృందావనులై భువనమోహనుడిగా వెలుగొందుతున్నారు. తుంగభద్రానది ఒడ్డున వెలిసిన రాఘవేంద్రుడు భక్తి పరిమళాలను విరబూయిస్తున్నారు. సద్గురు రాఘవేంద్ర జయంతి, పట్టాభిషేకాన్ని పురస్కరించుకుని గురు వైభవోత్సవాలు మంగళవారం నుంచి 26వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మంత్రాలయం శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆశీస్సులతో ఆరు రోజులపాటు వేడుకలు నిర్వహించనున్నారు.
బుధవారం రాఘవేంద్రస్వామి 402వ పట్టాభిషేక మహోత్సవం చేపట్టనున్నారు. ఉత్సవంలో భాగంగా రాఘవేంద్రస్వామి స్వర్ణపాదుకలకు ముత్యాలు, రత్నాలు, పుష్పాలతో అభిషేకం చేయనున్నారు. 21నుంచి 26వరకు రాయరు పాదపూజ, సంస్థానపూజ, తీర్థప్రసాద వితరణ ఉంటుంది. 26న రాఘవేంద్రస్వామి 428వ జయంతి ఉత్సవం కనులపండువగా నిర్వహించనున్నారు. ప్రతి ఏటా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టు వస్ర్తాలు సమర్పించనున్నారు. గురు వైభవోత్సవాలను పురస్కరించుకుని రాఘవేంద్రస్వామి పూర్వావతారమైన ప్రహ్లాదరాయలు వివిధ రకాల రథోత్సవాలపై ఆశీనులై భక్తులను కటాక్షించనున్నారు. గురు వైభవోత్సవాలకు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాల మంత్రులు, వివిధ శాఖల అధికారులు, నాయకులు, ప్రముఖులు విచ్చేయనున్నారు. ప్రముఖులకు అవార్డులు ప్రదానం చేయనున్నట్లు శ్రీమఠం పీఠాధిపతి సుధేంద్ర తీర్థులు తెలిపారు. గురు వైభోత్సవాలకు చక్కటి ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పీఠాధిపతి పేర్కొన్నారు. వైభోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి చూసి తరించాలని కోరారు.