దేవరకద్ర, జూన్ 14 : తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ సర్కారు దవాఖానలను ఆధునీకరించడంతో పేదలకు కార్పొరేట్స్థాయి వైద్యం అందుతున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం దేవరకద్రలో నిర్వహించిన వైద్యారోగ్య దినోత్సవానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో సర్కారు దవాఖానకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి ఉండేదన్నారు. ప్రజారోగ్య సంరక్షణపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వ దవాఖానలను ఆధునీకరించినట్లు తెలిపారు. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు దవాఖానల్లో అన్ని సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానల్లో కాన్పుల సం ఖ్య పెరగడంతోపాటు అన్నిరకాల వైద్యసేవలు అందుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో చెక్డ్యాం నిర్మాణంతో భూగర్భజలాలు పెరిగి బీడు భూములు సస్యశ్యామలంగా మారాయన్నారు. దళితబంధు పథకంతో పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు. మిషన్ భగీరథ పథకంతో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించినట్లు చెప్పారు. పేదల సంక్షేమానికి దేశంలో ఎక్కడాలేని పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు.
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం
సీఎం సహాయనిధి పేదలకు వరంలాంటిదని ఎమ్మె ల్యే ఆల అన్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన 80మందికి సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆపత్కాలంలో పేదలకు సీఎం సహాయనిధి అందించి అన్నివిధాలా ఆదుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీవో యాదయ్య, ఎంపీపీలు రమాదేవి, కదిరె శేఖర్రెడ్డి, డాక్టర్ శరత్చంద్ర, బీఆర్ఎస్ మండల అధ్యక్షు డు జెట్టి నర్సింహారెడ్డి, నాయకులు కొండారెడ్డి, శ్రీకాంత్యాదవ్, భాస్కర్రెడ్డి, ఖదీర్పాషా, కొండా శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.