నాగర్కర్నూల్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) ; ‘మాఘమాసం ఎప్పుడొస్తుందో.. ‘పెళ్లి కల వచ్చేసిందే బాలా’.. అంటూ సినిమా పాటలను తలపించేలా శుభ ముహూర్త ఘడియలు వచ్చేశాయి. 11వ తేదీ నుంచి మాఘమాసం ప్రారంభం కానుండటంతో ఇప్పటికే నిశ్చితార్థాలు కుదుర్చుకున్న నూతన వధూవరులు పెళ్లి పీటలెక్కనున్నారు. ఈనెలతో పాటుగా మార్చి, ఏప్రిల్లో పెద్ద ఎత్తున ముహూర్తాలు ఉన్నాయి. ఎండాకాలమంతా ఓ వైపు ఊష్ణతాపం, మరోవైపు పార్లమెంట్ ఎన్నికలతో పాటు పీపీపీ.. డుండుండుం.. మోతలు మోగనున్నాయి.
పెళ్లి ముహూర్తాలకు వేళైంది. కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న ఘడియలు రానే వచ్చాయి. ఈనెలతో పాటుగా మార్చి, ఏప్రిల్లోనూ పెద్దఎత్తున పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఇప్పటికే వివాహాలు నిశ్చయం చేసుకున్న ఆయా కుటుంబాలు తమ పిల్లలకు పెండ్లిళ్లను జరిపించనున్నాయి. ప్రతి సంవత్సరం మాఘమాసం పెండ్లిళ్లకు పెట్టింది పేరు. చాలా మంది ఈ మాసంలో పెండ్లిళ్లు నిర్వహించేందుకు ఇష్టం చూపిస్తారు. అంత కీలకమైన మాఘమాసం 11వ తేదీన ప్రారంభం కానున్నది. ఇక వధూవరుల జాతకాలను బట్టి ముహూర్త తేదీలు, సమయాన్ని పండితులతో ఖరారు చేసుకొంటున్నారు. ఈ జంటలు ఆయా తేదీల్లో పెళ్లి పీటలను ఎక్కి ఒక్కటికానున్నారు. ఈ మాసంలో భాగంగా ఫిబ్రవరి నెలలో 13, 14, 17, 18, 24, 28, 29వ తేదీలు పెండ్లిళ్లకు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. ఇక మార్చిలో 2, 3, 15, 17, 20, 22, 24, 25, 27, 28, 30వ తేదీలు, ఏప్రిల్లో 3, 4, 9, 18, 19, 20, 21, 22, 24, 26వ తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఇలా మూడు నెలల్లో 28 రోజులు పెండ్లిళ్లకు అత్యంత మంచి ముహూర్తాలు ఉండటం గమనార్హం.
మొదలైన సందడి
కొంత కాలంగా మాఘమాసం కోసం తల్లిదండ్రులతోపాటు ఆయా ఫంక్షన్ హాళ్ల యజమానులు, పూలు, వస్త్ర వ్యాపారులు, ఫొటోగ్రాఫర్లు, బ్యాండు మేళాల నిర్వాహకులు, కిరాణా వ్యాపారులు, వంట మనుషులు, ట్యాక్సీ వాహనదారులు ఎ దురుచూస్తున్నారు. పెండ్లిళ్లతో ఆయా కుటుంబాల్లో ఆనందం, కొత్త జీవితం తీసుకురావడంతో పాటుగా పలువురు వర్తకులు, వేద పండితులు, చిరువ్యాపారులకూ ఉపాధి దొరుకనున్నది. ఎట్టకేలకు మాఘమాసం రావడంతో పెండ్లిళ్లకు ఇప్పటికే క ల్యాణ మండపాలు, ఫంక్షన్హాల్స్ బుకింగ్ చేసుకుంటున్నారు. మార్కెట్లలో జనాల సందడి మొదలవగా.. బస్సుల్లో రద్దీ పెరిగింది. ప్రస్తుతం ఎండాకాలం కావడంతో అందుకు తగ్గట్లుగా.. ఏసీలు, ఇతర సౌకర్యాలు ఉండేలా ఏర్పాట్లు చేపట్టనున్నారు. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలు జరిగే పరిస్థితులు కూడా ఉండటం పెండ్లిళ్లకు రాజకీయ ప్రాధాన్యతను తీసుకు రానున్నది. ఆయా పార్టీల తరపున నాయకులు, అభ్యర్థులు పెద్ద ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొని ప్రజల్లో మమేకంకానున్నారు. ఫలితంగా ఈ మాఘమాసం ముహూర్తాలు పెండ్లిళ్లకు పొలిటికల్ కళను తీసుకురానున్నాయి.
ఆగస్టులో తిరిగి..
ప్రస్తుతం మూడు నెలల ముహూర్తాలు దాటితే మళ్లీ వచ్చే ఆగస్టులోనే మంచి ఘడియలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది ఈ నెలల్లోనే కొత్తగా పెండ్లిళ్లు కుదుర్చుకోవడం, కుదిరిన పెండ్లిళ్లు పూర్తి చేయడానికి పలు కుటుంబాలు సిద్ధమవుతున్నాయి. మొత్తంమీద ఈ ఎం డాకాలంలో ఊరూవాడా పెండ్లి మంత్రాలు, బ్యాండుబాజా మేళాలతో హోరెత్తనున్నాయి.