మహహబూబ్నగర్: గంజాయి పూర్తి స్థాయి నిర్మూలనకు ప్రభుత్వం, అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. గంజాయి సాగు చేసే వారిపై ప్రభుత్వం అన్ని విధాలా కట్టడి ప్రారంభమైంది. గ్రామాల్లో అంతర పంటగా గంజాయిని సాగు చేయకుండా ఉండేందుకు అవగాహన సదస్సులు నిర్వహించిన అధికారులు ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొంతకాలంగా గుట్టు చప్పుడు కాకుండా గంజాయి సాగు చేస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లాలో గంజాయి సాగు చేస్తున్న ఓ రైతుకు రాష్ట్రంలోనే తొలిసారిగా రైతుబంధు పథకాన్ని నిలిపివేస్తూ ఈ నెల 5న జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఆదేశాలు జారీ చేశారు. మహబూబ్నగర్ తర్వాత సోమవారం జోగులాంబ గద్వాల జిల్లాలో కలెక్టర్ క్రాంతి ఆదేశాల మేరకు గంజాయి సాగు చేస్తూ పట్టుబడిన ఇద్దరు రైతులకు రైతుబంధు నిలిపివేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
గత ఏడాది అక్టోబర్ 28న, జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం తాటికుంటకు చెందిన ఎం.అంబస్వామి, ఎం.సిద్ధయ్యకు అయిజ మండలం దేవబండ గ్రామంలో ఉన్న 8 ఎకరాల పొలాన్ని బి.రామాంజనేయులు, పెద్ద రాముడు అనే వ్యక్తులు కౌలుకు తీసుకున్నారు. ఆ తర్వాత మిరపపంట సాగు మాటున గంజాయి సాగు చేశారు. విశ్వసనీయమైన సమాచారం మేరకు ఎక్సైజ్, పోలీసు, రెవెన్యూ అధికారులు అక్కడ దాడులు చేశారు. రెండు చోట్ల 43 గంజాయి మొక్కలను గుర్తించారు. శాంపిల్స్ తీసుకుని వాటిని అక్కడే ధ్వంసం చేశారు. కౌలుకు ఇచ్చిన ఇద్దరి పైనా, గంజాయి సాగు చేస్తున్న వారిపైనా పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. గంజాయి సాగు చేస్తున్న రైతులకు రైతుబంధు నిలుపదల చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పొలాన్ని కౌలుకు ఇచ్చిన రైతులకు జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇకపై రైతుబంధును నిలిపివేస్తూ జిల్లా ఇంచార్జి వ్యవసాయాధికారి ఎం.సక్రియా నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు.