సివిల్ సప్లయ్ కమిషనర్కు వినతి
మక్తల్రూరల్,ఫిబ్రవరి 7: నారాయణపేట జిల్లాలో చౌకధర దుకాణాలకు గతంలో సప్లయ్ చేసిన కందిపప్పు, శనగలు వినియోగాదారులకు పంపిణీ చేయగా కొంతమేరకు సరుకులు పాడైపోయి దుకాణాల్లో మిగిలి పోయాయని, వీటిని ఈపాస్ మిషన్ నిల్వ జాబితానుంచి తొలగించాలని కోరుతూ రాష్ట్ర సివిల్ సప్లయ్ కమిషనర్ను కోరినట్లు జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. ఈమేరకు సోమవారం హైదరాబాద్లో సివిల్ సప్లయ్ డిప్యూటీ కమిషనర్ పద్మజకు వినతి పత్రం అందించినట్లు ఆయన తెలిపారు. 2019-20 సంవత్సరంలో కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో తెల్లరేషన్ కార్డులు కలిగిన నిరుపేదలకు కందిపప్పు, శనగలను ఉచితంగా చౌకధర దుకాణాల ద్వారా పంపిణీ చేశారు. కాగా పేదలకు పంపిణీ చేయగా మిగిలిన కందిపప్పు, శనగలు అలాగే మిగిలి పోయాయని ఆయన తెలిపారు. దీంతో నెలల తరబడి సరుకులు ఉపయోగంలో లేకపోవడంతో ప్రతి నెల డీలర్లు నిల్వ చూపించాల్సి ఉంది. కొన్ని నెలలుగా సరుకలు నిల్వ చేయడం వల్ల కందిపప్పు, శనగలు పాడైపోయాయి. గతంలో నిల్వ ఉన్న స్టాక్ను గోదాంలకు చేర్చాలని పౌరసరఫరా అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో దాదాపు 90 శాతం సరుకులు ముక్కిపోయాయి. ఈవిషయాన్ని ఇదివరకు రాష్ట్ర కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా రేషన్ దుకాణాల్లో ఉన్న కందిపప్పు, శనగలను వెనక్కి తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈమేరకు ఏజెన్సీల ద్వారా దుకాణాల్లో నిల్వ ఉన్న సరకులను తనఖీ చేసి తీసుకెళ్లినట్లు రేషన్డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. ఇదిలాఉండగా పాడైన సరుకులు తీసుకెళ్లినప్పటికీ ఈపాస్ మిషన్లలో అలాగే స్టాక్ చూపిస్తుండడంతో డీలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరైనా ఎన్ఫోర్సుమెంట్ అధికారులు దుకాణాల తనఖీకి వచ్చినప్పుడు తాము స్టాక్ చూపించాలంటే ఇబ్బందిగా మారుతుందన్నారు.