వచ్చే బడ్జెట్లో రూ.20 వేల కోట్ల కేటాయింపులు
మరో దఫాలో నియోజకవర్గానికి రూ.200 కోట్లు
2 వేల మందికి చేకూరనున్న దళితబంధు లబ్ధి
దుష్ప్రచారం చేస్తున్న సంస్కారహీనులు
అట్టడుగు సామాజిక వర్గాలకు న్యాయం జరగాలి
వనపర్తిలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం
వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి
వనపర్తి, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : వనపర్తి జిల్లాలో దళితబంధు పథకం అమలైన గ్రామాల్లో పల్లెనిద్ర చేస్తానని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం నియోజకవర్గంలోని పార్టీశ్రేణులు, ప్రజలతో మంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో మరో విడుతలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో రెండు వేల మంది దళితులకు దళితబంధు పథకాన్ని వర్తింపజేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇందుకోసం నియోజకవర్గానికి రూ.200 కోట్లు ఇచ్చేలా వచ్చే బడ్జెట్లో సుమారు రూ.20 వేల కోట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతానికి నియోజకవర్గానికి వంద మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు. అర్హులైన దళితులందరికీ పథకం కింద సాయం అందజేస్తామన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ పథకాలు బాగున్నాయని, వారి రాష్ర్టాల్లో కూడా అమలు చేసేందుకు ఇతర రాష్ర్టాలు అధ్యయనం చేస్తున్నాయని తెలిపారు. అట్టడుగు సామాజిక వర్గాలకు న్యాయం జరగాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అన్నారు. దేశ, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలో ఇది గొప్ప మార్పుగా అభివర్ణించారు. ఒక సామాజిక ప్రయోజనం ఆశించి ఈ పథకం అమలు చేస్తున్నప్పుడు దుర్బుద్ధితో సంస్కారహీనులు చేసే దుష్ర్పచారాన్ని ప్రజలు పట్టించుకోవద్దని సూచించారు. అధికారం కోసం విమర్శలు చేయడం తప్ప ప్రజలకు మేలు చేకూర్చేది లేదని విమర్శించారు.
నిరాధార ఆరోపణలు చేస్తున్నవారి విమర్శలను ప్రజా క్షేత్రంలో తిప్పికొట్టాలని అన్నారు. సమాజంలో అట్టడుగున ఉన్న పేదల అభ్యున్నతికి తీసుకుంటున్న చర్యలపై మిగిలిన సామాజిక వర్గాలను చైతన్యం చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. వనపర్తి నియోజకవర్గం విషయానికొస్తే మొదట దళితబంధు అమలు నాలుగు గ్రామాలు పెంచికల్పాడు, మల్క్మియాన్పల్లి, గట్టుకాడిపల్లి, కర్ణమయ్య కుంటలో చేస్తామని తెలిపారు. తొలి విడుతలో 81 దళిత కుటుంబాలకు అమలవుతుందన్నారు. వనపర్తి మున్సిపాలిటీలో 5, పెబ్బేరులో 5, రేవల్లిలో 4, శ్రీరంగాపూర్ 5 కుటుంబాలకు దళితబంధు అందిస్తామని చెప్పారు. దళితబంధు పథకానికి అర్హులను ఎంపిక చేసిన తర్వాత ఎలా నిర్వహించాలన్న అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం వెంటనే పూర్తి కావాలని ఆదేశించారు. సీసీ మంజూరు కాని గ్రామాలకు మరో విడుతలో తీసుకొస్తామని పేర్కొన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని మంత్రి సూచించారు. మరో ఏడు కోట్ల రూపాయల విలువైన రోడ్లకు ప్రతిపాదనలు పంపామని, త్వరలో వీటికి ఆమోదం లభిస్తుందని చెప్పారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో వనపర్తి జిల్లా అగ్రగామిగా నిలబడాలని, దీనికి ప్రజాప్రతినిధులు, నాయకులు చొరవ తీసుకోవాలని కోరారు.
నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించామని ఆయనన్నారు. అలాగే వేల చెరువులను పునర్నిస్తున్నట్లు తెలిపారు. పాన్గల్ రహదారి నుంచి పెబ్బేరు రహదారి మీదుగా కొత్తకోట వరకు దాదాపు 9 కిలోమీటర్లతో అర్ధచంద్రాకారంలో ఔటర్ రింగురోడ్డు నిర్మించబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. భవిష్యత్తులో వనపర్తి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని చెరువులను కూడా పునర్నిర్మిస్తామని చెప్పారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే వనపర్తిని ఆదర్శ జిల్లాగా అభివృద్ధి చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు. దక్షిణ తెలంగాణలో చారిత్రాత్మక పట్టణంగా నిలిపేందుకు ప్రజల సహకారం, ఆశీర్వాదంతో కృషి చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులు, ఆదరణతో అన్ని రంగాల్లో ముందుంచేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.