అచ్చంపేటటౌన్/శ్రీశైలం, ఆగస్టు 31: శ్రీశైలం మహాక్షేత్రంలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. దేవస్థానం ఆధ్వర్యంలోని లలితాంబికా వాణిజ్య సముదాయంలోని ఒక బ్లాక్లో ఏర్పడిన షార్ట్ సర్కూట్తో మంటలు చెలరేగాయి. ఒక్కొక్కటిగా అంటుకుని సుమారు 14 దుకాణాల్లో రెండుగంటలపాటు మంటలు ఎగిసిపడుతూ పూర్తిగా దగ్ధమయ్యాయి. శ్రావణమాసం కావడంతో యాత్రికులకు అందుబాటులో ఉండేవిధంగా ఏర్పాటు చేసిన రూ.లక్షలు విలువ చేసే వస్తు సామగ్రి, ప్రసాదాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. దీంతో సుమారు రూ.2కోట్లకుపైగా ఆస్తినష్టం వాటిల్లి ఉంటుందని దుకాణాదారులు వాపోయారు. అర్ధరాత్రి విషయం తెలిసిన వెంటనే దేవస్థానం అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టడంతోపాటు ఫైర్ సిబ్బంది సహకారంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. సకాలంలో ట్రాన్స్ఫార్మర్ నుంచి విద్యుత్ను నిలిపి వేయకపోవడంతో ఇంతనష్టం సంభవించిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఘటనకు కారణాలు వెంటనే తెలుకోవాలని అధికారులను ఆదేశించి బాధితులతో మాట్లాడారు. తక్షణ సాయంగా ఒక్కో దుకాణాదారుడికి రూ.20వేలు ఆర్థిక సాయం అందజేశారు. దుకాణాలు కేటాయించేటప్పుడే ఫైర్ సేఫ్టీతోపాటు యాత్రికులు, దుకాణాల భద్రతకు అవసరమయ్యే చర్యలు చేపట్టాలని దేవస్థానం అధికారులతోపాటు కమిషనర్కు తెలిపినప్పటికీ పట్టించుకోలేదని దుకాణాదారులు ఎమ్మెల్యేకు విన్నవించారు. దేవస్థానం అధికారులు అద్దెలు నిర్ణయించడం తప్పా సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమవడంతో తమ దుకాణాలు ఇలా కాలిబూడిదయ్యాయని ఏకరువు పెట్టుకున్నారు. తమకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగే లా చూడాలని ఎమ్మెల్యేను అభ్యర్థించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ఆలయ ఈవో, స్థానిక తాసీల్దారుతో కలిసి ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు తెలిపారు.