కల్వకుర్తి, జనవరి 25: వానకాలంలో పత్తి సాగుచేసి తీవ్రంగా నష్టపోయిన రైతాంగం యాసంగి సాగుపై ఆశలు పెంచుకున్నారు. వానకాలంలో కురిసిన ఎక్కువ ముసురు వర్షాలకు పత్తి పంట దెబ్బతినడంతోపాటు దిగుబడి తగ్గింది. దిగుబడి తగ్గినా ధర ఎక్కువగా ఉంటుందని ఆశపడిన రైతులకు నిరాశే మిగిలింది. గతేడాది పత్తి ధర క్వింటాకు రూ.10వేలకు పైగా ఉంటే.. ఈ ఏడాది రూ.6వేల నుంచి రూ.7వేల మధ్యన ఉన్నది. దీంతో చాలామంది రైతులు తాము పండించిన పత్తి పంటను అమ్ముకునేందుకు మనసు రాక ఇండ్లలోనే ఉంచుకున్నారు. వానకాలంలో పత్తిపంట కలిసి రాకపోవడంతో రైతాంగం యాసంగిపై దృష్టి సారించింది. మరో వాణిజ్య పంటగా వేరుశనగపై ఆశలు పెంచుకున్న రైతాంగం పెద్ద ఎత్తున వేరుశనగ పంటను సాగుచేసింది. వేరుశనగ ధర కూడా ఆశాజనకంగా ఉండటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
కేఎల్ఐ ద్వారా సాగునీరు రావడంతో భూగర్భజలాలు పెరిగిన క్రమంలో రైతులు వేరుశనగపై దృష్టి సారించారు. కేఎల్ఐ సాగుజలాలు రాకముందు కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలో వానకాలం మాత్రమే ఎక్కువగా సాగుచేసే వారు. కేవలం బోరు బావులపైనే ఆధారపడి వ్యవసాయం చేసేవారు. యాసంగిలో ఎక్కడో ఒకచోట పంటలు సాగుచేసే వారు. యాసంగిలో కేవలం పశువులను బతికించుకునేందుకు పచ్చి పొప్ప, లూసన్ వంటి పశుగ్రాసాన్ని పెంచేవారు. కేఎల్ఐ సాగునీరు రావడంతో ఈ ప్రాంతంలో భూగర్భజలాలు పైకి వచ్చాయి, బోరుబావుల్లో నీరు సమృద్ధిగా ఉన్నది. దీంతో యాసంగిలో కూడా వేల ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్నారు. ప్రధానంగా వాణిజ్య పంట అయిన వేరుశనగపై
దృష్టి సారించారు.
కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఐదు మండలాల్లో మండలాల్లో 25వేల ఎకరాల్లో వేరుశనగను సాగుచేశారు. 13వేల ఎకరాల్లో వరి, వెయ్యి ఎకరాల్లో మొక్కజొన్న, 500 ఎకరాల్లో ఆముదాలు సాగు చేశారు. యాసంగిలో సాగుచేసిన వేరుశనగ పంటలు ఆశా జనకంగా ఉన్నాయి. రైతుల ఆశలన్నీ వేరుశనగ పంటపైనే ఉన్నాయి. సరాసరిన ప్రతి రైతు ఎంతో కొంత వేరుశనగ సాగుచేశారు. ఇప్పటివరకు 13వేల ఎకరాల వరకు వరి సాగుచేసిన రైతులు మరో వారం పది రోజుల్లో మరో నాలుగైదు వేల ఎకరాల్లో వరి నాటే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం వేరుశనగ ధర రూ.8వేలకు పైగా ధర పలుకుతున్నది. యాసంగి మొదట్లో వేరుశనగ పంట సాగుచేసిన రైతులు తమ పంటను మార్కెట్కు తీసుకొస్తున్నారు. ధర కూడా బాగానే ఉండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పత్తి దెబ్బతీసినా వేరుశనగ పంట బాగా పండితే అప్పులు తీర్చుకుంటామని రైతులు అంటున్నారు.