జడ్చర్ల, ఏప్రిల్ 28 : జడ్చర్లలోని పత్తి మార్కెట్లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో మక్కలు కొనుగోలు చేయాలని మంగళవారం రైతులు జడ్చర్ల-కల్వకుర్తి 167వ జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత పదిహేను ఇరవై రోజుల కిందట మొక్కజొన్నలను కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చినా అక్కడ మొక్కజొన్నలు కొనుగోలు చేయడం లేదని, బస్తాలు లేవని, లారీలు రావడం లేదంటూ సాకులు చెబుతూ రోజులు వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత పదిహేను రోజులుగా మార్కెట్లోనే పడిగాపులు కాస్తున్నామని అయినా కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా మక్కలను కొనుగోలు చేస్తామని చెబుతుంటే ఇక్కడ మాత్రం అధికారులు కొనుగోలు చేయకుండా రైతులను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఎన్నాళ్లు ఇక్కడే ఉండాలని, వర్షాలు కురుస్తుండడంతో మొక్కలు తడుస్తాయని బయపడుతూ ఉండాలా అని ప్రశ్నించారు. రైతులు రాస్తారోకో చేస్తున్న విషయం తెలుసుకున్న తాసీల్దార్ నర్సింగరావు, పీఏసీసీఎస్ సీఈవో యాదగిరి, పోలీసులు అక్కడకు చేరుకుని రైతులతో మాట్లాడారు. మొక్కలు కొనుగోలు చేసే దాక ఇక్కడి నుంచి కదిలేది లేదని రైతులు తేల్చి చెప్పడంతో అధికారులు మక్కలు కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమి ంచారు.
అనంతరం కొనుగోలు కేంద్రం దగ్గర మంగళవారం దాదాపు 10వేల బస్తాలను కొనుగోలు చేయడం జరుగుతుందని, అందుకు బస్తాలను ఇచ్చినట్లు సీఈవో యాదగిరి తెలిపారు. పంటలు కోతలకు వచ్చి మార్కెట్కు తరలించినా కొనుగోలు కేంద్రాల్లో మక్కలను కొనుగోలు చేయక పోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొక్కజొన్న రైతులు తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికి వచ్చినా దానికి అమ్ముకోవడానికి రైతుల అవస్థలు వర్ణనాతీతం.
పంటలు చేతి కొచ్చి నూర్పిళ్లు చేసి ఆరబెడితే అకాల వర్షాలు పడటంతో తడిసిపోవడం జరుగుతుంది. దాంతో రైతులు నష్టపోవడం జరుగుతుంది. అందుచేతనే రైతులు తమ పంటలను త్వరగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జడ్చర్లలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాంలో ఇప్పటి వరకు 50వేల బస్తాలను కొనుగోలు చేశారు. 20వేల బస్తాలను గోదాంకు తరలించగా మిగిలిన 30వేల బస్తాలు మార్కెట్ యార్డులోనే ఉండటంతో స్థలభావం, తూకం చేసిన బస్తాలను లారీల ద్వారా లిఫ్టింగ్ చేసి ఎన్డీఆర్ గోదాంకు తరలిస్తే అక్కడ హమాలీల సమస్యతో దించుకోవడం లేదు. దాంతో తూకం చేసిన మక్కలు మార్కెట్ యార్డులోనే ఉన్నాయని అందుచేతనే ఒక్క రోజు కొనుగోళ్లు నిలిపినట్లు పీఏసీసీఎస్ సీఈవో యాదగిరి తెలిపారు. మంగళవారం మరో పదివేల బస్తాలు కొనుగోలు చేసినట్లు తెలిపారు.
అమరచింత, ఏప్రిల్ 28 : ధాన్యం కొనుగోళ్లలో సర్కారు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మంగళవారం ఆత్మకూర్లో రైతులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ మండలంలోని నాలుగు గ్రామాల్లో గత వారం ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు ఆగమేఘాల మీద మహిళా సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినా.. జూరాల కొనుగోలు కేంద్రంలో కేవలం ఐదు వేల బస్తాల ధాన్యం కొనుగోలు చేసిన ఇప్పటికీ రైస్ మిల్లులకు తరలించలేదని ఆరోపించారు. అన్ని కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై జయన్న అక్కడికి చేరుకొని తాసీల్దార్ మోహన్కు సమాచారం ఇవ్వడంతో ఆయన వచ్చి వీలైనంత త్వరగా ధాన్యం కొనుగోళ్లు చేపడతామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. ఆందోళనలో వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.
150 బస్తాల మొక్కజొన్నలు తీసుకువచ్చి 15 రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదు. ఇంటిదగ్గర అన్ని విడిచి పెట్టి ఇక్కడకు వస్తే రోజులు గడుస్తున్నా కొనడం లేదు. ఈరోజు రేపు అంటూ బస్తాలు లేవని, లారీలు రావడం లేదంటూ కాయాపన చేస్తున్నారు. ఎన్నాళ్లు ఇలా ఇక్కడే ఉండాలో అర్థం కావడం లేదు.
– నానునాయక్, రైతు, తుప్పుడగడ్డతండా, జడ్చర్ల మండలం
మొక్కజొన్నలు తీసుకువచ్చి తొమ్మిది రోజులు అవుతుంది. 300 బస్తాలు మార్కెట్కు అమ్మకానికి తీసుకువస్తే మక్కలు కొనుగోలు చేయకపోవడం వలన తిండి తిప్పలు మాని ఇక్కడే రాత్రింబవళ్లు ఉంటున్నాం. అధికారులు బస్తాలు లేవని చెపుతున్నారని, నేటి వరకు మక్కలను కొనుగోలు చేయలేదు.
– భీమయ్య, రైతు, గంగాపూర్, జడ్చర్ల మండలం