జడ్చర్ల, డిసెంబర్ 15 : ఈ ఏడాది పత్తి దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. సాధారణంగా ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కానీ ఈసారి వర్షాలు ఎక్కువగా కురవడంతో పంట ఎదుగుదల దెబ్బతిన్నది. నల్లరేగడి, మడికట్లలో వర్షాలకు నీళ్లు నిలిచి పంట మురిగిపోయింది. పంటకు పూత తక్కువగా వచ్చింది. అతివృష్టితో పంటలు దెబ్బతిని ఎర్రబారాయి. అక్కడక్కడ మిగిలిన పంటను తెగుళ్లు పట్టి పీడించాయి. దీంతో ఎంతో ఖర్చుచేసి పురుగుల మందులు పిచికారీ చేసి పంటను కాపాడుకున్నా.. దిగుబడులు అంతంతగానే ఉన్నాయి. ఎకరాకు 3 నుంచి 4 క్వింటాళ్లకు మించి రాలేదు. గతేడాది మహబూబ్నగర్ జిల్లాలో 80,449 ఎకరాల్లో పత్తి సాగుచేయగా.. ఈ ఏడాది 99,536 ఎకరాల్లో సాగు చేశారు. వాస్తవానికి దిగుబడి తగ్గినప్పుడు ధరలు పెరగాలి. కానీ, ఈ ఏడాది అందుకు భిన్నంగా ఉన్నది. గతేడాది రికార్డుస్థాయిలో రూ.10 వేలు దాటిన ధర.. ఈసారి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు తగ్గింది. పదిహేను రోజుల నుంచి దాదాపు మరో రూ.వెయ్యి పడిపోయింది. ధరలు మరింత పడిపోయే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
ఈసారి సీజన్ ప్రారంభం నుంచి పత్తికి మంచి ధరలు లభించడంతో రైతులు మురిసిపోయారు. కానీ ఆ ఆశ ఎంతో కాలం నిలవలేదు. తగ్గిన ధరలను చూసి రైతన్నలు బెంబేలెత్తుతున్నారు. పెరిగిన పెట్టుబడి ఖర్చులను పోల్చుకుంటే క్వింటాకు రూ.12వేలకు పైచిలుకు ధర వస్తేనే గిట్టుబాటు అవుతుందని, ఇప్పుడు పంట అమ్మితే పెట్టుబడి కూడా రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండ్ లేకపోవడంతో ధరలు తగ్గుముఖం పడుతున్నాయని వ్యాపారవర్గాలు భావిస్తున్నాయి. ఈరోజు ఉన్న ధర రేపు ఉండడంలేదు. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో నవంబర్ 12వ తేదీన క్వింటా రూ.9,089 పలకగా.. 16వ తేదీన రూ.9189 ధర వచ్చింది. ఆ తర్వాత 19న రూ.9,001, 26న రూ.8,910, 30న రూ.8,679, డిసెంబర్ 7న రూ.8,295, 10న రూ.8,289, 14న రూ.8,409 ధర పలికింది. ఇలా ప్రతిరోజూ ధరలు తగ్గుతూనే ఉన్నది.
దిగుబడి.. ధర అంతంతే..!
కల్వకుర్తి, డిసెంబర్ 15 : తెల్ల బంగారానికి వన్నె తగ్గింది. రైతన్నల ఇంట్లో కాసులు కురిపించే పత్తి గరిష్ఠంగా రూ.8 వేల వరకు పలుకుతున్నది. దిగుబడి లేక, ధర రాక రైతుల ఇం ట్లోనే తెల్ల బంగారం మగ్గుతున్నది. కల్వకుర్తి రెవెన్యూ డివిజ న్ పరిధిలోని ఐదు మండలాల్లో 1,12,719 ఎకరాల్లో పత్తిని సాగుచేశారు. కల్వకుర్తి మండలంలో 26 వేలు, వెల్దండలో 23,500, వంగూరులో 33 వేలు, చారకొండలో 19,883, ఊర్కొండలో 10,336 ఎకరాల్లో పత్తి సాగుచేశారు.ఈ ఏ డాది పత్తిసాగు చేసేందుకు పెట్టుబడి ఎక్కువైందని రైతులు చె బుతున్నారు. వర్షాల కారణంగా పత్తిచేల్లో కలుపు ఎక్కువ వచ్చిందని, కలుపు తీసేందుకు కూలీల ఖర్చు పెరిగిందంటున్నారు. ఎండ తగలక.., రోజుల తరబడి ముసురు కురవడం తో పత్తిమొక్కలు గిడసబారిపోయాయి. పత్తి మొక్క ఏపుగా పెరగలేదు. దీంతో గూడలు పెద్దగా రాలేదు. కాయలు కాయలేదు. దీంతో ఎకరాకు మూడు క్వింటాళ్లలోపే దిగుబడి వచ్చిం ది. చాలా మంది రైతులకు క్వింటా లోపే ఉన్నది. గతేడాది క్వింటా సరాసరిన రూ.10 వేలకు కొనుగోలు చేశారు. ఈ ఏ డాది కూడా అదే ధర ఉంటుందని రైతులు భావించారు. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి. ధర పడిపోవడంతో పత్తిని అమ్ముకోలేక, నిల్వ ఉంచుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా, కల్వకుర్తిలో ఐదారు పత్తి జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి. దీంతో మిల్లర్ల మధ్య పోటీ ఉంటుందని, ధర కూ డా వస్తుందనే ఆశలో రైతులు ఉన్నారు. కాగా, మిల్లు నడవాలనే ఉద్దేశంతో క్వింటా రూ.8 వేలకు కొనుగోలు చేశామని, ఇప్పుడు అంత ధర లేకపోవడంతో అనవసరంగా కొనుగోలు చేసినట్లు మిల్లు నిర్వాహకులు చెబుతున్నారు.
పెట్టుబడి కూడా రావడంలేదు..
పత్తి ధరలు అమాం తం పడిపోవడంతో పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఏర్పడింది. గతేడాది క్వింటాకు రూ.10 వేలకు పైగా ఉన్నది. ఈ సారికూడా ధరలు పెరుగుతాయన్న ఉద్దేశంతో అధికంగా సాగుచేశారు. కానీ, ప్రస్తుతం మార్కెట్లో వస్తున్న ధరలను చూస్తే భయమేస్తున్నది. పత్తిపంట అధిక వర్షాలతో దెబ్బతిన్నది. ఎకరాకు రెండు, మూడు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే వ్యాపారులు పత్తిని ఎక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. పత్తికి ప్రభుత్వం రూ.6,838 మద్దతుధర ప్రకటించింది. కానీ ఈ ధరలు సరిపోవు. రూ.10వేలకుపైగా ఉంటేనే గిట్టుబాటవుతుంది.
– నర్సింహారెడ్డి, రైతు, అమ్మపల్లి
తీవ్రంగా నష్టపోయాను..
వానకాలంలో ఎనిమిదెకరాల్లో పత్తి పంట సాగుచేశాను. వర్షాలు ఎక్కువగా కురవడంతో నాలుగెకరాల్లో రెండు సార్లు విత్తనాలు నాటా. కలుపు అధికంగా ఉండడంతో కూలీల ఖర్చు ఎక్కువైంది. మొక్క సరిగా పెరగలేదు. గూడ వస్తూనే పత్తి చేను ఎర్రగా మారింది. పెద్దగా కాయలు కాయలేదు. మొత్తం రూ.1.70 లక్షల పెట్టుబడి అయ్యింది. కానీ, ఎనిమిది ఎకరాల్లో 8 క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదు. ఇప్పుడు ఉన్న ధరకు పంటను అమ్ముకుంటే పెట్టుబడి కూడా రాలేని పరిస్థితి ఉన్నది. ఏం చేయాలో అర్థం కావడం లేదు.
– కే.శశిపాల్రెడ్డి, రైతు, తాండ్ర, కల్వకుర్తి మండలం