మహబూబ్నగర్, డిసెంబర్ 16 : పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ దేవ్యక్షేత్రంగా నిర్మితమవుతుందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావుతో కలిసి మన్యంకొండ, మినీ ట్యాంక్బండ్ వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులపై మంత్రి పవర్పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన్యంకొండలో వెయ్యి మంది భక్తులు ఒకేసారి భోజనం చేసేలా అన్నదాన సత్రం నిర్మిస్తామన్నారు. భవనం కింది భాగంలో వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. పెద్ద హనుమాన్ విగ్రహం, అడ్వంచరీ మ్యూజియం, వరహావతారం, కల్యాణకట్ట, ప్రత్యేకంగా స్టాల్స్, షాపింగ్ కాంప్లెక్స్, టూరిజం హోటళ్లతోపాటు రోప్వేను ఏర్పాటు చేస్తామన్నారు. మినీ ట్యాంక్బండ్ వద్ద సందర్శకులను ఆకట్టుకునేలా నిర్మాణాలు చేపడుతామన్నారు. సస్పెషన్ బ్రిడ్జి, ఐలాండ్, నాలుగు యుద్ధవిమానాలు, ఒరిజినల్ విమానం, మౌంటేన్, ఓపెన్ థియేటర్, సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని వివరించారు.
మన్యంకొండ చరిత్రను పరిగణలోకి తీసుకొని అభివృద్ధి చేసేందుకు రూ.50 కోట్లు మంజూరైనట్లు మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ క్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ ఏడాది రూ.25 కోట్లు.. వచ్చే సారి రూ.25 కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. హరితహోటల్ నిర్మాణానికి రూ.15 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ప్రత్యేకంగా 18 రూంల నిర్మాణం, కొండపైకి డబుల్ రోడ్డుక రూ.3.5 కోట్లు, ఇతర సదుపాయాలకు రూ.4 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అలాగే పాలమూరులోని లక్ష్మీనృసింహస్వామి ఆలయ అభివృద్ధికి రూ.6 కోట్లు మంజూరైనట్లు వివరించారు. అనంతరం మన్యంకొండ, నృసింహస్వామి ఆలయాల అభివృద్ధికి మంజూరైన రూ.56 కోట్ల జీవో కాపీలను వేర్వేరుగా పాలకవర్గాలు మంత్రి అందజేశారు.
మహబూబ్నగర్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ పక్కా ప్రణాళికలతో అడుగులు వేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. పాలమూరులో ఉపాధి అవకాశాలను పెంచి ప్రతి తల్లిదండ్రులకు మా బిడ్డ ఏ పని అయినా చేసుకొని బతుకుతాడన్న నమ్మకాన్ని కల్పిస్తామన్నారు. రూ.9800 కోట్లతో అమరరాజా బ్యాటరీ కంపెనీ రాబోతున్నదని తెలిపారు. కంపెనీ ఏర్పాటుతో 10వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. జనవరి నుంచి హన్వాడ పమీపంలో ఫుడ్పార్కు పనులు ప్రారంభించేలా చూస్తామన్నారు. ఇతర రాష్ర్టాల నుంచి పాలమూరుకు వచ్చి బతికే రోజులు రానున్నాయన్నారు. ఉమ్మడి జిల్లాలోని సోమశీలతోపాటు అన్ని పర్యాటక ప్రాంతాలు సముచిత స్థానం కల్పిస్తూ అభివృద్ధి చేస్తామన్నారు.
కులమతాలకు తావు లేకుండా అందరి సహకారంతో ముందుకు అడుగులు వేస్తున్నామని వివరించారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా వెంటనే స్పందించి ఆదుకుంటామని భరోసా కల్పించారు. పట్టణంలో సూపర్స్పెషాలిటీ దవాఖాన నిర్మించి అన్ని వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అభివృద్ధికి కంకణబద్ధులమై పనిచేస్తామని స్పష్టం చేశారు. మహబూబ్నగర్ బ్రాండ్ ఇమేజ్ను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. తెలిసీ తెలియక కొందరు రాజకీయాల కోసం ఎది పడితే అది మాట్లాడుతున్నారని, వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
అలాగే 24, 25న జరిగే పిల్లలమర్రి వద్ద పీర్లమర్రి దర్గా ఉర్సు గంధం ఉత్సవాల పోస్టర్లను మంత్రి, కలెక్టర్ వెంకట్రావు ఆవిష్కరించారు. కార్యక్రమాల్లో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, మన్యంకొండ పాలకవర్గం మధుసూదనాచారి, వెంకటేశ్ యాదవ్, శ్రీనివాసులు, శేఖర్, పురుషోత్తం, దానం నాగేందర్, కుర్మయ్య, సువర్ణ, చిన్నయ్యగౌడ్, లక్ష్మీనృసింహాస్వామి ఆలయ కమిటీ సభ్యులు కోట్ల నర్సింహులు, నాయకులు, పీర్లమర్రి కమిటీ సభ్యులు మోసిన్భాషాఖాద్రి, మహహ్మద్ దస్తగిరి, మహమ్మద్ మఖిన్ అన్సారీ, షేక్అహ్మద్, దస్తగిర్ మతీన్, ఖలీముల్లా హుస్సేని, మహమ్మద్ బిలాల్, అబ్దుల్ రహెమాన్, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.