గద్వాల, మార్చి 29: ఇప్పటి వరకు సికింద్రాబాద్ నుంచి గద్వాల, గద్వాల నుంచి రాయిచూర్ వరకు రైల్వే విద్యుద్దీకరణ పనులు పూర్తయి రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. అయితే దక్షిణ మధ్య రైల్వే మరో మైలురాయిని దాటింది. గద్వాల-కర్నూల్ వరకు సుమారు 54 కిలోమీటర్ల వరకు విద్యుద్దీకరణ పూర్తయింది. దీంతో దక్షిణమధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్ నుంచి ధర్మవరం వరకు, నైరుతి రైల్వే పరిధిలో ధర్మవరం నుంచి బెంగళూర్ వరకు విద్యుద్దీకరణ పూర్తి చేసింది. దీంతో రైలు నడవడానికి మార్గం సుగమమైంది. దీంతో ఎలక్ట్రిక్ ట్రాక్షన్తో రైళ్లను నడపడానికి దక్షిణమధ్య రైల్వే వీలు కల్పించింది.
దక్షిణమధ్య రైల్వే 2022-2023 ఆర్థిక సంవత్సరంలో విద్యుద్దీకరణకు అధిక ప్రాధాన్యమిస్తూ పనులు వేగవంతం చేసింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గద్వాల-కర్నూల్ సిటీ మధ్య 54 కి.మీ. వరకు విద్యుద్దీకరణ పనులు పూర్తి చేసింది. దీంతో జోన్ పరిధిలో సికింద్రాబాద్-ధర్మవరం మధ్య పూర్తి స్థాయిలో విద్యుద్దీకరించబడిన రైలు మార్గంలో ఇప్పుడు విద్యుత్ ట్రాక్షన్తో రైళ్లను నడిపే వీలు కలిగింది. గద్వాల-కర్నూల్, మహబూబ్నగర్-సికింద్రాబాద్-ముద్దేడ్-మన్మాడ్ విద్యుద్దీకరణ ప్రాజెక్టులో భాగంగా పూర్తి చేయబడింది. ఈ ప్రాజెక్టు 2018-2019 సంవత్సరంలో రూ.916.07 కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు. సికింద్రాబాద్-మహబూబ్నగర్ మధ్య విద్యుద్దీకరించారు. మహబూబ్నగర్-గద్వాల-కర్నూల్సిటీ-డోన్ విభాగాల మధ్య పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. దక్షిణమధ్య రైల్వే పరిధిలోని డోన్-గుత్తి-ధర్మవరం, నైరుతి రైల్వే పరిధిలోని ధర్మవరం-బెంగళూర్ సిటీ విభాగాల మధ్య విద్యుద్దీకరణ ప్రస్తుతం పూర్తయింది. ఈ రైల్వే నిర్మాణాలు పూర్తి కావడంతో ప్యాసింజర్, రవాణా రైళ్లు ఇప్పుడు హైదరాబాద్-ధర్మవరం-బెంగళూర్ వరకు సజావుగా ప్రయాణించడానికి వీలు ఏర్పడింది. తద్వారా రైలు ప్రారంభ స్థానం నుంచి చివరి స్టేషన్ వరకు రైళ్లను ఎలక్ట్రిక్ ట్రాక్షన్తో నడిపేందుకు వీలు ఏర్పడింది.
విద్యుద్దీకరణ పనులు పూర్తి చేయడంలో అద్భుతమైన పనితీరు కనబర్చిన ఎలక్ట్రికల్ వింగ్ను దక్షిణమధ్య రైల్వే మేనేజర్ అరుణ్కుమార్ జైన్ను అభినందించారు. గద్వాల-కర్నూల్ స్టేషన్ల మధ్య ఈ మార్గంలో విద్యుద్దీకరణ పూర్తి చేశామని తెలిపారు. సికింద్రాబాద్-బెంగళూర్ మధ్య మొత్తం సెక్షన్లో ఎలక్ట్రికల్ రైళ్లను ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. జోన్ పరిధిలో ఇప్పటికే బ్రాడ్గేజ్ మార్గాలను 100 శాతం విద్యుద్దీకరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు.