అలంపూర్, ఫిబ్రవరి 13 : రాష్ట్రంలోని ఏకైక శక్తి పీఠమైన అలంపూర్ జోగుళాంబ అమ్మవారి సేవలు ఇకపై ఆన్లైన్లో పొందొచ్చని దేవాదాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని అరణ్య భవన్లో సోమవారం జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయ వెబ్సైట్ను ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహంతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాత్రికులు, భక్తుల సౌకర్యార్థం వెబ్సైట్ను రూపకల్పన చేసినట్లు చెప్పారు. ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్ కూడా అందుబాటులో ఉంటుందన్నారు.
ఆన్లైన్లో ఆర్జిత సేవలు, విడిది రూం బుకింగ్, చండీహోమం, అర్చన టికెట్లు, ఆలయ దర్శనం వంటి సేవలను http://srijogulamba.com వెబ్సైట్ ద్వారా వినియోగించుకోవచ్చన్నారు. చండీ హోమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే అబ్రహం ఆన్లైన్ ద్వారా మొదటి టికెట్ (రూ.వెయ్యి) బుక్ చేసుకున్నారు. కార్యక్రమంలో సిర్పూర్ కాగజ్నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, దేవాదాయ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ, ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ఈవో పురేందర్ కుమార్, అర్చకులు ఆనంద్ శర్మ, విక్రాంత్ శర్మ, యూనియన్ బ్యాంకు అధికారులు రమణ, ఫణీంద్రకుమార్, ఆలయ సిబ్బంది రంగనాథ్, బ్రహ్మయ్యచారి తదితరులు పాల్గొన్నారు.