భూత్పూర్, జనవరి 9: దాయాదుల నుంచి తమ భూమి తమకు దక్కాలంటూ మూడురోజులుగా తల్లి అంత్యక్రియలు చేయకుండా నిలిపిన ఘటన మండలంలోని కప్పెటలో చోటుచేసుకున్నది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన బోయ నారాయణ, బోయ రాములు అన్నదమ్ములు. గ్రామంలో 1960లో 12ఎకరాల 18గుంటలు భూమిని కొనుగోలు చేశారు. అయితే అన్న బోయ నారాయణ తెలివిగా తన పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. కాలానుగుణంగా తమ్ముడు రాములు మరణించాడు. అనంతరం రాములు భార్య బోయ చెన్నమ్మ(70), కుమారుడు నిరంజన్(బీసు) తమ పేరున రిజిస్ట్రేషన్ చేయాలని వేడుకున్నా కాలయాపన చేశారు. తదనంతరం బోయ నారాయణ మరణించాడు. దీంతో నారాయణ ముగ్గురు కొడుకులు తండ్రి మరణానంతరం తమ పేరున భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
నిరంజన్ తమకు భాగపరిష్కారం చేసి తమ పేరున భూమి రిజిస్ట్రేషన్ చేయాలని తన అన్నలను వేడుకున్నా కాలయాపన చేస్తూ వచ్చారు. నిరంజన్ అన్నలు మానాన్న సొంతంగా భూమిని కొనుగోలు చేశాడని ఎగవేత మాటలు మాట్లాడుతూ కాలం గడిపారు. ఇది విన్నా బోయ రాములు భార్య చెన్నమ్మ గ్రామ పెద్దలు, అధికారుల చుట్టూ తిరిగి వేసారింది. దీంతో శనివారం సాయంత్రం 4గంటలకు తన ఇంట్లో మృతిచెందింది. చెన్నమ్మ మరణించడంతో ఆమె కుమారుడు నిరంజన్, కూతురు అంజలమ్మ తమ పొలం తమకే దక్కాలంటూ ఆందోళనకు దిగారు. వారికి మద్దతుగా కులస్తులు, గ్రా మస్తులు నిలిచారు. సోమవారం మండలకేంద్రంలోని పోలీస్స్టేషన్, తాసిల్దార్ కార్యాలయానికి పెద్దసంఖ్యలో వచ్చి ఫిర్యాదు చేశారు.
ఈ విషయమై తాసిల్దార్ చెన్నకిష్టన్న మాట్లాడుతూ చనిపోయిన శవాన్ని ఇంట్లో ఉంచకుండా అంత్యక్రియలు చేయాలని రెండు, మూడురోజుల్లో గ్రామానికి వచ్చి గ్రామస్తుల సమక్షంలో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అలాగే వారు కలెక్టరేట్కు వెళ్లగా అందుబాటులో అదనపు కలెక్టర్ ఉండగా ఆయనకు వినతిపత్రం అందజేశారు. దీంతో అదనపు కలెక్టర్ వినతిపత్రం స్వీకరించి మాట్లాడారు. బాధితులకు న్యాయపరంగా పొలం దక్కేలా మావంతు సహకారం అందిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. సాయంత్రం మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నరేశ్గౌడ్, సర్పంచ్ వేణుగోపాలాచారి, గ్రామస్తులు మాసగౌడ్, ఆశన్న, జంగిరెడ్డి, హెచ్ నర్సింహులు, కాశీశ్వర్, కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు. మూడురోజులుగా ఇంట్లోనే మృతదేహాన్ని పెట్టి ఆందోళన చేయడం జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది.