నారాయణపేటటౌన్, ఏప్రిల్ 29: బాల, బాలికలు విద్యలో రాణించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుంచి గురుకులాల్లో చేరిన విద్యార్థులు వేసవి సెలవుల్లో కలెక్టర్ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గురుకులాలు చాలా ఉత్తమమైన పాఠశాలలని, అందులో చదువుకోవడం గొప్ప అదృష్టమన్నారు. ప్రతి విషయాలు క్షుణ్ణంగా నేర్చుకోవాలని, నేర్చుకోవడానికి హద్దులు లేవన్నారు. గురుకులాల్లో చదువులు, వసతులపై పిల్లలను అడిగి తెలుసుకున్నారు. తమ పాఠశాలల్లో ఊహించనంత గొప్ప వసతులు ఉన్నాయని, ఎక్కాలు రాని తాము ఇప్పుడు ఇరవై ఎక్కాలు అవలీలుగా చెప్పగలుగుతున్నామన్నారు. అనివార్య కారణాలతో చదువు మధ్యలో ఆపేసిన పిల్లలు తప్పకుండా ఓపెన్ స్కూల్స్లో చేరి పది, ఇంటర్, డిగ్రీలు పూర్తి చేయాలన్నారు. వారికోసం ప్రత్యేకంగా నారాయణపేట, మద్దూర్, మక్తల్, అంగన్వాడీ సీడీపీవో ఆఫీసులో కేరీర్ కౌన్సెలింగ్ సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సెంటర్లో ఒక కౌన్సిలర్ అందుబాటులో ఉంచి ఓపెన్ స్కూల్లో పిల్లలు చేరడానికి అన్నివిధాలా సహాయం చేస్తారన్నారు. అదేవిధంగా ఆన్లైన్ పాఠాలు వినడానికి అన్నిసౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
పనులు త్వరితగతిన పూర్తికావాలి
కోస్గి, ఏప్రిల్ 29: మన ఊరు-మనబడి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ఇప్పటికీ వంటగది పనులు ప్రారంభించకపోవడం ఏంటని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. శనివారం కోస్గి తాసీల్దార్ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి తగు సూచనలు సలహాలు చేశారు. సమస్యలను పరిష్కరించాలని తాసీల్దార్ మమతను ఆదేశించారు. అనంతరం మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా జెడ్పీహెచ్ఎస్ బాలుర, జీఎంయూపీఎస్, జెడ్పీహెచ్ఎస్ బాలికలను తనిఖీ చేశారు. పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ దవాఖాన నిర్మాణ పనులను పరిశీలించారు. దవాఖానలో రోజువారీ ఓపీ రోగుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రక్తపరీక్షలు చేసే ల్యాబ్ను పరిశీలించారు. వైద్యులు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. అలాగే పట్టణంలో రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించాలన్నారు. అలాగే మద్దూర్ మండలం దోరేపల్లి ప్రభుత్వ పాఠశాలలో వంటగది నిర్మాణ పనులు పూర్తికాకపోవడంపై మండిపడ్డారు. వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు.