వనపర్తి, డిసెంబర్ 3: ప్రస్తుత కాలంలో దివ్యాంగులమని నిరుత్సాహపడొద్దని, వికలత్వం అనేది శరీరానికే తప్ప మనస్సుకు, ఆలోచనకు కాదని నిరూపించాలని కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా అన్నారు. జిల్లాకేంద్రంలోని సంఘం ఫంక్షన్హాల్లో స్త్రీ, శిశుసంక్షేమ వికలాంగుల వయోవృద్ధులశాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా అదనపు కలెక్టర్ ఆశిష్సంగ్వాన్, డీడబ్ల్యూవో పుష్ఫలత, సంబంధిత అధికారులు దివ్యాంగులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అంతకుముందు దివ్యాంగుల సమస్యలు, వారికి కావాల్సిన డిమాండ్లను వివరించడంతోపాటు కొంతమంది దివ్యాంగులు పాటలు పాడగా, కొత్తకోటకు చెందిన చిన్నారి దివ్యాంగురాలు చేసిన నృత్య ప్రదర్శన ఆకట్టుకున్నది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులు వారి అవయవలోపాలను లోపాలుగా భావించి అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు.
సాధించాలన్న తపన ఉంటే వికల్వతం అడ్డురాదని సూచించారు. ప్రభుత్వం దివ్యాంగుల దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నదని, కరోనా వల్ల రెండేండ్లు జిల్లాలో దివ్యాంగుల దినోత్సవాన్ని జరుపుకోలేదన్నారు. 18ఏండ్లు నిండిన దివ్యాంగులు ఓటుహక్కు నమోదు చేసుకోవాలని తెలిపారు. దివ్యాంగులతో ముఖాముఖి సమావేశానికి తేదీని నిర్ణయించి ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని డీడబ్ల్యూవోకు సూచించారు.
అనంతరం క్రీడా పోటీల్లో గెలుపొందిన దివ్యాంగులకు, అందుకు కృషిచేసిన అధికారులను సన్మానించి ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో వనపర్తి జిల్లా జూనియర్ అదనపు సివిల్ జడ్జి రవికుమార్, డీఆర్డీవో నర్సింహులు మున్సిపల్ వైస్చైర్మన్ వాకిటి శ్రీధర్, దివ్యాంగులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఖిల్లాఘణపురం, డిసెంబర్ 3: దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం మండలకేంద్రంలోని భవిత కేంద్రంలో యువశక్తి పౌంఢేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సీడబ్ల్యూఎస్ఎన్ అధికారి యుగంధర్, ఎంఈవో ఉషారాణి హాజరై మాట్లాడారు. దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో అన్నిరంగాల్లో రాణించాలన్నారు. పౌంఢేషన్ అధ్యక్షుడు మధు మాట్లాడుతూ దివ్యాంగుల సామర్థ్యాన్ని గుర్తించి ఉన్నతస్థాయిలో రాణించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఐఈడీ కోఆర్డినేటర్ రజిత, తిరుపతిరెడ్డి, జీహెచ్ఎం అనురాధ, సామాజిక కార్యకర్త గోపి, విద్యార్థులు పాల్గొన్నారు. వికలాంగుల హక్కుల జాతీయవేదిక సోషల్ మీడియా మండల అధ్యక్షుడు రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు.
అమరచింత, డిసెంబర్ 3: దివ్యాంగులను అన్నిరంగాల్లో ప్రోత్సహించాలని తాసిల్దార్ షేక్చాంద్పాష అన్నారు. శనివారం మండలకేంద్రంలోని డీఎంఆర్ పాఠశాలలో భవిత సెంటర్ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు. దివ్యాంగులకు ఆటలపోటీలను నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమానికి హెచ్ఎం బాలస్వామి, ఎంఈవో భాస్కర్సింగ్, సీఆర్పీ స్వామి, ఉపాధ్యాయురాలు స్వప్న, రెడ్క్రాస్ జిల్లా ఉపాధ్యక్షుడు కలాంపాషా తదితరులు పాల్గొన్నారు.
గోపాల్పేట, డిసెంబర్ 3: ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని ఆయా పాఠశాలల్లో శనివారం దివ్యాంగులైన విద్యార్థులకు ఐఈఆర్పీ కృష్ణ, మలీశ్వరి, ఎంఈవో శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో ఆటలు, సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం రమాకాంత్ మాట్లాడుతూ దివ్యాంగులైన విద్యార్థులను తక్కువగా చూడొద్దని, చేయూత అందిస్తే ఉన్నతంగా రాణిస్తారని అన్నారు. కార్యక్రమంలో శ్రీనాథ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వీపనగండ్ల, డిసెంబర్ 3: ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను తోటి స్నేహితులు, ఉపాధ్యాయులు ఆదరించాలని బాలికల ఉన్నత పాఠశాల హెచ్ఎం మంజులాదేవి అన్నారు. శనివారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎమ్మార్సీలో దివ్యాంగులకు ఆటలు, పాటలు పోటీలు, చిత్రలేఖనం నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కృష్ణ, రాజస్వప్న, శేఖర్, రాధ, ఐఈఆర్పీ రాముడు తదితరులు పాల్గొన్నారు.